(G.SrinivasaReddy,News18,Khammam)
టెంపుల్ టౌన్ భద్రాచలం పట్టణంలో కలకలం రేగింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు ఉద్యమంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. మావోయిస్టు ఉద్యమ విధానాలను తీవ్రంగా ప్రశ్నిస్తూ నక్సల్ ఉద్యమ ఉనికికే సవాల్ విసిరారు. భద్రాచలం పట్టణంలో అక్కడక్కడ వెలసిన పోస్టర్ల సారాంశం ఏంటంటే.. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ గొట్టం ద్వారా 50 సంవత్సరాలలో సాధించింది ఏమిటి? అదివాసులారా ... మీ మద్దతు విధ్వంసానికా...? అభివృద్దికా...? PLGA వారోత్సవాలు అంటే ప్రజలను పీడించడమేనా? ఇంటికి 50 రూపాయలు మరియు ఒకకిలో బియ్యం బలవంతంగా సేకరించడమేనా వారోత్సవాలు అంటే? ఆటోకు 500 రూపాయలు, ట్రాక్టర్ కు 500 రూపాయలు పన్ను విధించి బలవంతంగా వసూలు చేయడమేనా ఉద్యమం అంటే?
అమాయక ప్రజలను పార్టీలో చేరమని ప్రోత్సహిస్తూ వారి జీవితాలను నాశనం చేయడమేనా విప్లవం అంటే? అంటూ మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తూ పోస్టర్లలో పలు అంశాలను ప్రస్తావించారు. ఇంకాస్త ముందుకెళ్లి విప్లవోద్యమ సిద్ధాంతాలను సూత్రీకరించే నాయకుల పిల్లలేమో విదేశాల్లో విలాసంగా బతుకుతున్నారు. అమాయక ఆదివాసీల పిల్లలనేమో తుపాకీ పట్టమని చెబుతున్నారు. ఇదేం న్యాయం అంటూ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఇలా నక్సల్ ఉద్యమానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడూ గళం వినిపించడం, పోస్టర్లు వేయడం చోటుచేసుకున్నా.. భద్రాచలం కేంద్రంగా గతంలో ఎన్నడూ ఇలా జరిగిన దాఖలా లేదు.
అయితే దీని వెనుక పోలీసుల ప్రోద్బలం ఉండే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మావోయిస్టు ఉద్యమానికి ప్రస్తుత కేంద్ర బిందువుగా ఉన్న చత్తీస్ఘడ్కు కూతవేటు దూరంలోనే ఉన్న భద్రాచలంలో ఇలా మావోయిస్టులను నిలదీస్తూ, ప్రశ్నిస్తూ, సిద్ధాంతాల పైన మావోయిస్టుల చిత్తశుద్ధి ఏపాటిదంటూ పేర్కొనడం విశేషం. పలు సైజుల్లో, రంగులతో తీర్చిదిద్దినట్టు, డీటీపీ సెంటర్లో చక్కగా డిజైన్ చేయించినట్టున్న పోస్టర్లను ఏ ఒక్కరో వేయించే పరిస్థితి ఉండదు. ఆర్గనైజ్డ్గా మాత్రమే ఇలా చేయగలిగే పరిస్థితి ఉంది. పైగా ప్రజాక్షేత్రంలో అడుగడుగునా తమ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్న మావోయిస్టులకు ఇలాంటి వ్యతిరేక పోస్టర్లు ఎవరు వేశారో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.
ఒకవేళ ఫలానా వాళ్లు వీటి వెనుక ఉన్నారన్న విషయం రూఢిగా తెలుసుకుంటే మావోయిస్టులకు టార్గెట్ కావడం కూడా ఖాయం. ఈ విషయాలపై అవగాహన ఉన్నన ఎవరూ కూడా ఇలాంటి రిస్క్ చేయరు. కాబట్టి దీనివెనుక ఖచ్చితంగా పోలీసుల వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావోయిస్టు ఉద్యమం పట్ల సాధారణ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను గుదిగుచ్చి, ప్రశ్నలను రూపొందించారు. ఏళ్ల తరబడి సమాజంలో పేరుకుపోయిన పలు ప్రశ్నలను పోస్టర్ల రూపంలో వ్యక్తీకరించినట్టు అర్థం అవుతోంది. ఉద్యమ తీవ్రతకు సమీపంలో ఉన్నప్పటికీ తమపై నేరుగా నక్సల్స్ గతంలో ఎన్నడూ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏ విధమైన పరిణామాలకు దారితీస్తాయోనన్న భయం భద్రాచలం వాసుల్లో వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Khammam, Maoist, Posters