POLICE ARRESTED A WOMAN AND MAN WHO LOOTING TRAVELLERS WHO PREFER CAR WHILE IN JOURNEY FULL DETAILS HERE HSN KMM
తొందరగా ఇంటికి వెళ్లొచ్చని ఎల్బీనగర్ లో కారు ఎక్కాడో వ్యక్తి.. లోపల ఓ యువతి.. రాత్రి 10 దాటాక..
నిందితుల అరెస్టును చూపుతున్న పోలీసులు
హైదరాబాద్ వచ్చి చిన్నచిన్న పనులు చూసుకుని ఖమ్మం బస్సుకోసం ఎల్బీనగర్ క్రాస్లో ఎదురు చూస్తున్నారు. ఆయన అక్కడ నిల్చొన్న ఓ పది నిమిషాలకు బస్సు రాలేదు కానీ, ఓ కారు (మారుతి.. ఏపీ11 ఎల్ 6332) వచ్చి ఆగింది.
దూర ప్రయాణం చేసి అలసిసొలసిన శరీరం కాస్త సుఖం కోరుతుంది. బస్సులు ఎక్కి దిగి.. ఎక్కి దిగి దుమ్ము ధూళి కొట్టుకుని చిట్టచివరి మజిలీ చేర్చే బస్సు కోసం రోడ్డు పైన ఎంతో సేపటినుంచి ఎదురుచూస్తుండగా బస్సుకు బదులుగా ఎవరైనా కారులో వచ్చి లిఫ్ట్ ఆఫర్ చేస్తే, ఆహా ఏమి ఈ భాగ్యం అనుకుంటూ ఏమాత్రం ఆలోచించకుండా ఎక్కేస్తాం. బస్సు టికెట్కు కాస్త ఎక్కువైనా వాళ్లు అడిగినంత ఇచ్చేస్తాం. కారణం లగ్జరీ.. ఏసీ.. వేగంగా సుఖమైన ప్రయాణం. త్వరగా ఇల్లు చేరదామన్న ఆలోచన. ఇది మనందరం నిత్య జీవితంలో ఏదో ఒకనాడు ఫేస్ చేసేదే. సరిగ్గా ఇలాంటి సగటు ప్రయాణికులే టార్గెట్గా ఓ దారిదోపిడీ ముఠా తన పని తాను చేసుకుని పోతోంది. టార్గెట్ దొరికిన అనంతరం ఈ ముఠాలోని సభ్యులంతా ప్రయాణికుల్లానే అమాయకంగా కారులోకి ఎక్కుతారు. ఒకరికి ఒకరు తెలీనట్టే నటిస్తారు. సమయం చూసి తమ పని తాము చేస్తారు. ఉన్నదంతా ఇచ్చేసి కారు దిగి పొమ్మని హుకుం జారీ చేస్తారు.. లేదంటే ఆ ముఠాలో ఉన్న మహిళతో మరో కట్టు కథ అల్లించే ప్రయత్నం చేస్తారు.
దోమలపల్లి మట్టయ్య. ఖమ్మం నగరంలోని శ్రీరాంనగర్కు చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచి మేనేజరుగా పనిచేస్తున్నారు. గత ఫిబ్రవరి 26వ తేదీన ఆయన అనంతపురం నుంచి ఇంటికి బయలుదేరారు. నేరుగా హైదరాబాద్ వచ్చి చిన్నచిన్న పనులు చూసుకుని ఖమ్మం బస్సుకోసం ఎల్బీనగర్ క్రాస్లో ఎదురు చూస్తున్నారు. ఆయన అక్కడ నిల్చొన్న ఓ పది నిమిషాలకు బస్సు రాలేదు కానీ, ఓ కారు (మారుతి.. ఏపీ11 ఎల్ 6332) వచ్చి ఆగింది. మేం కొత్తగూడెం వరకు వెళ్తున్నాం. వచ్చే వాళ్లు ఎవరైనా ఉంటే రండంటూ మట్టయ్యకు ఆఫర్ చేశారు. దీంతో అప్పటికే అలసి పోయి ఉన్న మట్టయ్య పెద్దగా ఆలోచించకుండానే కారు ఎక్కేశారు. తెలిసిన రూట్. పైగా సాయంత్రమే అయింది. రాత్రి పది పదకొండు గంటలకల్లా వెళ్లిపోతామన్న భరోసాతో ఆయన ఏమాత్రం సంకోచించలేదు. ఈ క్రమంలో మట్టయ్యతో పాటు మరో వ్యక్తిని కూడా ఎక్కించుకున్నారు. ఆ వ్యక్తి సూర్యపేటలో దిగిపోయాడు. ఇక కారులో మిగిలింది మేనేజరు మట్టయ్య. కారులోని ఓ యువతి. డ్రైవర్ మాత్రమే. కారు మరో పది నిమిషాల్లో ఖమ్మం చేరుతుందనగా పొన్నేకల్- తల్లంపాడు స్టేజిల మధ్యన హఠాత్తుగా నిలిపేశారు. మట్టయ్యను కత్తులతో బెదిరిస్తూ రెండు చేతులకు ఉన్న బంగారు ఉంగరాలు, పర్సు, సెల్ఫోన్, మరికొంత నగదును తీసుకున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని, ఇంకేదైనా తేడా చేస్తే అబ్యూజ్ చేశావని కేసు పెడతానంటూ ఆ మహిళ బెదిరించింది. దీంతో చేసేదేమీ లేక బెదిరిపోయిన మట్టయ్య ఉన్నదంతా ఇచ్చేసి కారు దిగిపోయాడు. అనంతరం ఎలాగోలా ఇంటికి చేరుకున్న మట్టయ్య మరుసటి రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మధ్య కాలంలో చెయిన్ స్నాచింగులు, ఇంకా ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో విసిగిపోయిన పోలీసులు నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. కోదాడ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా అటుగా వచ్చిన మారుతి కారులో కత్తులు కనిపించడం, దాన్లో ఉన్న మహిళ, ఇతర వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కొద్ది రోజుల క్రితం మేనేజరు మట్టయ్యను దోచుకున్నది వారేనని అంగీకరించారు. నిందితుల్లో మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన ధరావత్ కవిత కాగా, మరొక వ్యక్తిని హైదరాబాద్కు చెందిన కూర అయ్యప్పగా గుర్తించారు. వీరిద్దరూ సుజాతనగర్ వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికారు. ఈ ముఠా గతంలో ఏమైనా దారిదోపిడీలకు పాల్పడిందా.. గతంలో ఖమ్మం రూరల్, కూసుమంచి పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన చెయిన్ స్నాచింగ్లకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.