తెలంగాణ(Telangana)లో అధికార సాధనే లక్ష్యమంటోన్న బీజేపీ (BJP) ఇవాళ (జులై 3, ఆదివారం) హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇవాళ సాయంత్రం జరగబోయే విజయ సంకల్ప సభ (Vijaya Sankalpa Sabha)లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖ్యఅతిథిగా పాల్గొని కాషాయశ్రేణులకు నిర్దేశం చేస్తారు. మోదీ సభ సందర్భంగా జంట నగరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను బీజేపీ బుక్ చేసుకోవడం, జిల్లాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండటంతో ఇవాళ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు చెబుతున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగే బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్, జూబ్లీ బస్ స్టేషన్, రాష్ట్రపతి రోడ్, సరోజినిదేవి రోడ్, సర్దార్ పటేల్ రోడ్, బేగంపేట ఎయిర్ పోర్ట్, మహాత్మా గాంధీ రోడ్, పంజాగుట్ట, బేగంపేట, రాజ్ భవన్, జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్ హెచ్ఐసీసీ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు తమ ప్రయాణాలను మానుకుంటే మంచిదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు.
మోదీ సభకు భారీగా ఆర్టీసీ బస్సులు: బీజేపీ విజయ సంకల్ప్ బహిరంగ సభకు గ్రేటర్ జోన్లో 953 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నేతలు ఈ బస్సులను బుక్ చేశారు. గ్రేటర్ జోన్లోని 28 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే బస్సులు కేటాయించవద్దని కొందరు టీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరిగింది.
మెట్రో రైళ్ళు యథాతథం : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం మెట్రో రైళ్ల రాకపోకలపై వస్తున్న ఊహాగానాలకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెరదించారు. మూడు కారిడార్ల పరిధిలో రైళ్లు యథావిధిగా నడుస్తాయని, రోజూ మాదిరిగానే అన్ని స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని పేర్కొన్నారు. కాగా.. కారిడార్-3 నాగోలు-రాయదుర్గం మార్గంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ సమీపంలో ఆదివారం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అప్పటికప్పుడు నిర్ణయాలు వెలువడే అవకాశముంది.
సభా వేదిక వద్దే పీఎంవో : ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో ప్రధాని కార్యాలయం కొలువుదీరింది. మోదీ ఆసీనులయ్యే వేదిక కింది భాగంలో గుడారం నమూనాలో పీఎంవోను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి పీఎంవోలోని కొందరు అధికారులు ఈ ఆఫీసుకు తరలివచ్చారు.
జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ? : టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైషమ్యాలు పెరిగిన క్రమంలో జాతీయ పార్టీ బహిరంగ సభకు స్థానిక జీహెచ్ఎంసీ సహాయనిరాకరణ చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరవుతున్న పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ ఏర్పాట్లకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) యంత్రాంగం ఏ మాత్రం సహకరించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Hyderabad, Hyderabad police, Pm modi