రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంపై వ్యతిరేకత వస్తోంది. అందులో భాగంగానే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా బీటెక్, డిగ్రీ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంపై ఎన్ఎస్యూఐ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరికాదని తెలిపారు.
ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే.. కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. పదో తరగతి పరీక్షల విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ పరిధిలో పరీక్షలు నిర్వహించొద్దంటూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిది జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీలు ఎక్కువగా గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బీటెక్, డిగ్రీ పరీక్షలు ఏలా నిర్వహిస్తారని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసిన విధంగానే బీటెక్, డిగ్రీ విద్యార్థులను ఈ సెమిస్టర్ వరకు ప్రమోట్ చేయాలని పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Exams, High Court