(E. Santhosh, News 18, Peddapalli)
కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ (National Means Cum-Merit Scholarship - NMMS) అర్హత పరీక్షలో పెద్దపల్లి (Peddapalli) జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఇటీవల విడుదలైన 'ఎన్ఎంఎంఎస్' ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొత్తం 25 మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు అందనున్నాయి. విద్యార్థులు, విద్యాసంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్ష (NMMS Exam)కు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో తమ విద్యార్థులు ఎంపిక అవుతుండడంపై పెద్దపల్లి జిల్లా లింగాపూర్ మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఏమిటీ 'నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష'?..
పాఠశాల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకుప్రతి ఏటా రూ. 12000 స్కాలర్షిప్ అందిస్తుంది ప్రభుత్వం. ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అర్హత పరీక్షలకు ఎనిమిదో తరగతి విద్యార్థులు అర్హులు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసేవరకు ఈ స్కాలర్షిప్ అందుతుంటుంది.
పరీక్షా విధానం: నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాట్ (Mental Ability Test -MAT), శాట్ (Scholastic Aptitude Test -SAT) పేపర్లలో వివిధ అంశాలపై MCQ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపరుకు 90 మార్కుల చొప్పున 180 మార్కులు ఉంటాయి. ఒక్కో పరీక్ష 90 నిముషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏ విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు:
1. ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 7వ తరగతి స్పష్టమైన ఉత్తీర్ణత పొందిన తర్వాత కనీసం55% లేదా తత్సమాన గ్రేడ్లతో 8వ తరగతి చదువుతున్న సాధారణ విద్యార్థులు అయి ఉండాలి.
2. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ/స్థానిక సంస్థ/ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల నుండి విద్యను అభ్యసిస్తూ ఉండాలి.
3. హయ్యర్ సెకండరీ పాఠశాలలో స్కాలర్షిప్ కొనసాగింపు కోసం, అభ్యర్థి 10వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించాలి.
4. అలాగే 12వ తరగతిలో స్కాలర్షిప్ను కొనసాగించడానికి, స్కాలర్షిప్ అవార్డు గ్రహీత తప్పనిసరిగా 11వ తరగతి నుండి మొదటిప్రయత్నంలోనే 55% మార్కులు లేదా తత్సమానమైన స్కోర్తో స్పష్టమైన ఉత్తీర్ణత పొందాలి. SC/ST వర్గానికి చెందిన విద్యార్థులకు,మార్కులలో 5% సడలింపు ఇవ్వబడుతుంది.
5. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
6. అలాగే, NVS, KVS, సైనిక్ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ NMMS స్కాలర్షిప్కు అర్హులుకారు.
పైన పేర్కొన్న అర్హతలు ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా NMMS ఫారమ్ను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ అర్హత పరీక్ష కోసం ముందుగా విద్యార్థులు https://scholarships.gov.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్కాలర్షిప్కు ఎంపికవడంపై ఉపాధ్యాయుల హర్షం:
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) అర్హత పరీక్షలో లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. పదేళ్లుగా పదుల సంఖ్యలో తమ విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికై సత్తా చాటుతున్నారని, కరోనాతో రెండేళ్లుగా తరగతులు సరిగా జరగకపోయినా ఈ ఏడాది అధిక మంది విద్యార్థులు సత్తా చాటారని వారు పేర్కొన్నారు. విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించడంతో విశేష ఫలితాలు వస్తున్నాయని అన్నారు. మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి అవసరమైన శిక్షణను అందించారు. రామగుండంలోని లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మార్కులతో ఉతతీర్ణత సాధించటం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని విద్యార్థులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exam results, Local News, Peddapalli, Scholarships, Telangana students