(P.Srinivas,New18,Karimnagar)
పెద్దపల్లి Peddapallyజిల్లా రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( RFCL)ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లుగా విమర్శలు వస్తున్నాయి. కార్మికుల నియామకం పేరుతో స్థానిక ఎమ్మెల్యే (MLA)అనుచరులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని అమాయకుల్ని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిద్దరు కాదు సుమారు 800మంది దగ్గర డబ్బులు తీసుకొని తాత్కాలిక ఉద్యోగాలు కల్పించారని దీనిపై సీబీఐ ఎంక్వైరీ(CBI enquiry) చేయించాలని పట్టుబడుతున్నారు విపక్షాల నేతలు. కార్మికుల దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ (BJP)నేతలు.
కార్మికుల జీవితాలతో చెలగాటం..
పెద్దపల్లి జిల్లా రామగుండం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( RFCL)ఎరువుల కర్మాగారంలో కార్మికులను అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరులు మోసం చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సెంట్రల్ గవర్నెంట్ జాబ్ పేరుతో స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్ అనుచరులు 790మంది దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఆ విధంగా ఉద్యోగాలు పొందిన వాళ్లలో చాలా మందివి ఉద్యోగాలు ఉడిపోయి రోడ్డునపడ్డారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లంతా తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగడంతో టీఆర్ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఉద్యోగాల పేరుతో అవినీతి..
1999 మార్చి 31 న మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారం కేంద్ర ప్రభుత్వ చొరవతో 2017 లో పునః ప్రారంభమైంది. ( RFCL)కర్మాగారం ఎరువుల ప్యాకింగ్ , లోడింగ్ , అన్ లోడింగ్ కాంట్రాక్టును గుజరాత్కు చెందిన చౌదరి ఎంటర్ ప్రైజెస్ తీసుకుంది. ఫైవ్ స్టార్ రేటింగ్ కంపెనీగా ఉన్నప్పుడు కటింగ్స్ పోగా రోజు కూలీ 619రూపాయలు వచ్చేవి. సుమారు 800 నుంచి 900 మంది కార్మికులకు ఉపాధి పొందేవాళ్లు. అయితే చౌదరి ఎంటర్ ప్రైజెస్ ఏంట్రీతో సీన్ మొత్తం రివర్సైపోయింది.
రోడ్డున పడ్డ అమాయకులు..
ఈ కంపెనీ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏకంగా 790 మంది స్థానిక కార్మికులను పనుల నుంచి తప్పించింది. మిగతా కూలీలకు కూడా 420 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. స్థానికంగా తొలగించిన కూలీల స్థానంలో 150 మంది బీహారీ కార్మికులను నియమించుకుంది. ఫలితంగానే స్థానిక కార్మికులను చౌదరి ఎంటర్ ప్రైజెస్ కంపెనీ తీసేయడంతో..బడా బాబుల అనుచరుల్లో కలవరం మొదలైంది. అందుకే ఇప్పుడు ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందని , కెమికల్ జలాలు గోదావరిలో కలుపుతున్నారని వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలంటూ టీఆర్ఎస్ నేతలు ధర్నాలకు దిగారు.
సీబీఐ విచారణ జరపాలంటున్న బీజేపీ..
ఇదంతా కేవలం స్థానిక ఎమ్మెల్యే , అధికార పార్టీకి చెందిన నాయకులు పాల్పడిన అవినీతి అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆరోపించారు. బాధితులకు డబ్బులు వెనక్కి ఇవ్వాలన్నారు. ఈస్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించి రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ని జైల్లో వేయాలన్నారు. అంతే కాదు ఎలాంటి టెండర్ లేకుండా ఎరువుల కర్మాగారంలో ఉన్న కోట్లాది రూపాయల బూడిద, స్క్రాప్, మెటీరియల్స్ కొందరు నాయకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు.
ఆత్మహత్యే శరణ్యమంటున్న బాధితులు..
పర్మినెంట్ ఉద్యోగాలనే పేరుతో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన మాటలు విని నిరుద్యోగులు అప్పులు చేసి మరీ డబ్బులు కట్టారు. మరికొందరు పొలాలు, భూములు అమ్ముకొని మరీ లక్షలు ముట్టజెప్పారు. తీరా ఉద్యోగాలు ఊడిపోవడంతో తమను మోసం చేసింది ఎమ్మెల్యే ఆయన అనుచరులేనని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Peddapalli, Telangana, TRS leaders