E.Santosh, News18, Peddapalli
నచ్చిన పనిచేయడంలో ఉండే సంతృప్తి వేరు. అందుకే కొందరు లక్షల జీతం వచ్చినా.. తమకు నచ్చినపని చేసేందుకే ముందుకెళ్తుంటారు. అలాంటి కేటగిరీలోకే వస్తాడు బుగ్గ శ్రీనివాస్ శర్మ. పోటీ ప్రపంచంలో నెట్టుకురావడానికి ఐటీఐ పూర్తి చేశాక, రేడియాలజీ చేసి హైదరాబాద్ (Hyderabad) లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో రేడియాలజీగా పని చేశాడు పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండంలోని ఆదాభి రామగుండంకు చెందిన బుగ్గ శ్రీనివాస్ శర్మ. అయితే, చాలీచాలని జీతాలకు పని చేయడం కంటే స్వశక్తిని మించినది లేదని బలంగా విశ్వసించాడు. కులవృత్తిని మించిన దైవం లేదని పల్లెబాట పట్టాడు. శర్మ కుటుంబం తాతల తరాల నుండి పురోహితం చేస్తూనే మరోవైపు వంటలు చేస్తూ జీవనాధారం పొందేవారు. ఈ వంట వృత్తి తాతల నుండి వంశపరంగా వస్తుండగా శ్రీనివాస్ ఇప్పుడు కొనసాగిస్తున్నారు.
ఉన్నత చదువుతో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీనివాస శర్మ నమ్ముకున్న వృత్తిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా శ్రీనివాస శర్మ వంట రుచి చూపించారు. శ్రీనివాస శర్మ వెజిటేరియన్ వంటలు మాత్రమే చేస్తారు. శ్రీనివాస శర్మ వంటల రుచి చూసిన వారు వాహ్ అనాల్సిందే.
రామగుండంలోని ఆలయాల్లో ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగినా శ్రీనివాస శర్మ వంట రుచులే. రామగుండం అని మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, మంచిర్యాల , నిజామాబాద్ ,పెద్దపల్లి, కరీంనగర్ , జగిత్యాల ,హైదరాబాద్ వంటి జిల్లాలలో కూడా శ్రీనివాస్ శర్మకి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. సీజన్ లో ఇతర రాష్ట్రాల నుండి మధ్యప్రదేష్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి అని శర్మ తెలిపారు.
విదేశాల నుండి కూడా శర్మకి ఆఫర్లు
శ్రీనివాస శర్మ వంట రుచులకు విదేశాల నుండి ఆఫర్లు వచ్చాయట. అక్కడ ప్రముఖ పేరొందిన హోటల్స్ బారతీయ వంట రుచుల మాస్టర్ గా పలు మార్లు అఫర్ చేశాయట. అయితే, తనను నమ్ముకున్న వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అందుకోసమే అక్కడికి వెళ్లలేదని తెలిపాడు. చదువుకొని ఉద్యోగం చేస్తూ సెటిల్ అవుదామని అనుకున్న శర్మ.. ఉద్యోగం వచ్చినా అది మనసుకు నచ్చేలేదని.. చాలీ చాలని జీతానికి పని చేయడం ఇష్టం లేక వదిలేశాడు.
స్వగ్రామానికి వచ్చి తిరిగి తమకి వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని నమ్ముకుని వంటలు చేయడం ప్రారంభించాడు. ఈ వృత్తితో ఉపాధి పొందడమే కాకుండా నాతో పాటు ప్రత్యక్షంగా 50 మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే తమ వంశపారంపరంగా వస్తున్న వృత్తిని బ్రతికిస్తున్నానన్న తృప్తి ఉందని శ్రీనివాస్ శర్మ అన్నారు. వంటలతో పాటు పురోహితం కూడా కొనసాగిస్తానని శర్మ ఆనందంగా చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana