(P.Mahendar,News18,Nizamabad)
ప్రైవేట్ స్కూల్ టీచర్లు(Private school teachers)పిల్లలకు విద్య చెప్పే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ(Discipline), క్లాస్ ఫస్ట్(Class first)రావాలని ఆశపడి తల్లిదండ్రులు వేలకు వేలు డబ్బులు చెల్లించి కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తుంటే వాళ్లు పిల్లల్ని పనిష్మెంట్(Punishment)పేరుతో ఎంతలా ఇబ్బంది పెడతున్నారో నిజామాబాద్(Nizamabad)లో జరిగిన ఈ సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సింది పోయి బద్ద శత్రువుల్లా చూడటం, చిన్న కారణాలతో స్టూడెంట్స్ తట్టుకోలేనంతగా శిక్షించినందుకు ఏకంగా ఓ ఏడేళ్ల పాప ప్రాణాలు విడిచిపెట్టిన ఘటన సంచలనం రేపింది. అసలు అంత పనిష్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలిసి స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
హోం వర్క్ చేయలేదని కోపంతో..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈసంఘటన తల్లిదండ్రుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జి స్కూల్లో అర్సపల్లికి చెందిన ఏడు సంవత్సరాల ఫాతీమా రెండవ తరగతి చదువుతుంది. ఈ నెల 2వ తేదీన స్కూల్లో ఫాతీమా హోంవర్క్ చేయలేదని ఓ టీచర్ సుమారు గంట పాటు బెంచీపై నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడ పై మోయించారు. అంతటితో ఆగాకుండా చిన్నారి తలపై స్కేల్ తో కొట్టారు.
పనిష్మెంట్ పేరుతో ప్రాణాలు తీశారు..
స్కూల్లో టీచర్ ఇచ్చిన పనిష్మెంట్కి ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గడ్డకట్టిందని ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ అమ్మాయి మంగళవారం మృతి చెందింది. చదువుకొని ప్రయోజకురాలు అవుతుందని భావించిన ఫాతిమా తల్లిదండ్రులు చదువు చెప్పే టీచర్ వేసిన శిక్షకు ప్రాణాలు విడిచిందన్న వార్తతో కన్నీటి పర్యాంతం అయ్యారు. తన కూతురిని కొట్టిన టీచర్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి ముజీబ్ ఖాన్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ప్రైవేట్ స్కూల్ టీచర్ కర్కశం..
ఫాతిమా చనిపోయిన వార్త తెలుసుకున్న విద్యా సంస్థ స్కూల్ ప్రాంగణాన్ని మూసివేశారు. విషయం తెలిసిన నిజామాబాద్ మండల విద్యాధికారి రామారావు పరిశీలించారు. ఫాతిమా చదువుతున్న స్కూల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్కి చెందినట్లుగా తెలిసింది. చిన్నారిపై కఠినంగా వ్యవహరించిన టీచర్పై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్ది సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్లో అడిగినంత ఫీజులు తలతాకట్టు పెట్టి మరీ కడుతున్నారు తల్లిదండ్రులు. ఆలాంటిది విద్యార్ధులకు అర్థం అయ్యే విధంగా విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్.. కర్కశంగా ప్రవర్తించడంతో చిన్నారి ప్రాణాలు కోల్పొయిందన్న వార్త నగరం అంతటా వ్యాపించింది. స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Private teachers, Telangana News