(P.Mahendar,News18,Nizamabad)
మనిషి అన్నీ విధాలుగా అభివృద్ధి చెందుతున్న మూఢనమ్మకాలు, క్షుద్రపూజలను మాత్రం వీడటం లేదు. మూర్ఖత్వంతో అపోహలు, అనుమానాలు పెట్టుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రం కామారెడ్డి(Kamareddy)జిల్లాలో జరిగిన ఓ దారుణ హత్యకు కేవలం క్షుద్రపూజలనే అనుమానమే కారణమని తేలడంతో స్థానికులు సైతం భయపడిపోతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట(Bibipeta)మండల కేంద్రానికి చెందిన 62సంవత్సరాల ఇర్రోళ్ల మల్లయ్య(Irrolla Mallayya)ను స్థానికులు కొందరు రాళ్లతో కొట్టి చంపారు. అటుపై పెట్రోల్(Petrol) పోసి నిప్పు అంటించారు. మల్లయ్య, నర్సవ్వ(Narsavva) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు కావడంతో వృద్ధ దంపతులు ఇద్దరే కలిసి జీవిస్తున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
మృతుడు మల్లయ్య ఇంటి పక్కన ఉండే మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు మల్లయ్యను పలుమార్లు హెచ్చరించారు. తీరు మారకపోవడంతో కక్ష పెంచుకొని హతమార్చేందుకు కొత్త పథకం అలోచించారు. మంత్రాలు చేసి మహిళను లోబర్చు కున్నడాని ఆనుమానం పెట్టుకున్నారు. అర్ధరాత్రి మల్లయ్య ఆ మహిళను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసుకోవడం గమనించిన మహిళ బంధువులు గడ్డపారతో తలుపులు పగులగొట్టి ఇంట్లో ఉన్న మల్లయ్యను బయటకు లాక్కొచ్చి రాళ్లతో కొట్టారు. తలపై బండరాళ్లు వేశారు. స్థానికుల దాడి చేస్తుండగా మల్లయ్య భార్య నర్సవ్వ తప్పించుకొని పారిపోయింది. అటుపై దాడి చేసిన వ్యక్తులు బైక్లోని పెట్రోల్ తీసి మల్లయ్యపైపోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన మల్లయ్య స్పాట్లోనే మృతి చెందాడు.
మంత్రగాడనే ముద్రవేసి హత్య..
మనుషుల్లో మానవత్వం కరువైందని..కేవలం అనుమానం, అపోహలతో ఇంతటి దారుణానికి తెగించారనే విషయం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మల్లయ్య హత్య కేసును సీరియస్గా తీసుకున్నారు. రెండు బృందాలుగా ఏర్పడి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ బంధువులైన కొంగరి పోచయ్య. రాజు కుమార్ని నిందితులుగా గుర్తించారు. బీబీపేట బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. మృతుడు మల్లయ్యకు మంత్రాలు వస్తాయని వాటితోనే తమ కుటుంబ సభ్యురాలిని లోబర్చుకున్నాడని నిందితులు పోలీసులకు తెలియజేశారు. నిందితులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారని భిక్కనూర్ సీఐ తిరుపయ్య తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల్ని నిజామాబాద్ జైలుకు తరలించారు.
ఇది చదవండి : చిలకజోస్యానికి కరీంనగర్ జిల్లాలోని ఆ గ్రామం ఫేమస్ .. అది ఏ ఊరంటే
స్థానికుల్లో భయాందోళన..
మల్లయ్య హత్య స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కక్ష పెంచుకున్న మహిళ బంధులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై భయాందోళనకు గురవుతున్నారు. మంత్రాలు, క్షుద్రపూజలు చేసి మహిళను లోబర్చుకున్నాడనే అనుమానంతోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటంపై ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Nizamabad, Telangana