(P.Mahendar,News18,Nizamabad)
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి పెళ్ళి అనే బంధంతో ఒక్కటైనా జంట. తోడు-నీడగా ఉంటానని బాసలు చేసి పెళ్లి చేసుకున్న భర్త తాగుడుకు బానిసై భార్య పాలిట కాలయముడయ్యడు. కట్టుకున్న భార్య గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దారుణంగా నరికి చంపిన ఘటన కామారెడ్డి(Kamareddy)జిల్లాలో చోటుచేసుకుంది. ఉన్మాదమో, కిరాతకమో అర్ధం కాని విధంగా కట్టుకున్న భార్యను చంపిన ఆయుధంతోనే తాను గాయపరుచుకొని ప్రాణాలు తీసుకున్న ఘటన స్ధానికంగా కలకలం రేపింది.
ఆ ఒక్క మాటకే హత్య...
భర్తను ఎక్కడికి వెళ్లావు అని భార్య అడిగినందుకు ఒక హత్య మరో ఆత్మహత్య జరిగింది. కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఈఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సారుగు సంజీవులు ఐదేళ్ల క్రితం రమ్యశ్రీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం సాఫీగానే సాగింది. వీళ్ల దాంపత్యానికి గుర్తుగా కూతురు పుట్టింది. గత కొద్ది రోజులుగా సంజీవులు వ్యసనాలకు బానిస అయ్యాడు. సంజీవులు సంతాయుపేట శివారులోని వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఒక హత్య, మరో ఆత్మహత్య..
ఈమధ్య కాలంలోనే సంజీవులు మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తరచూ భార్యతో గొడవపడుతూ వచ్చాడు. గురువారం కూడా అదే సిస్ట్యూవేషన్ మరోసారి ఎదురైంది. మద్యం తాగి ఇంటికి వచ్చిన సంజీవులును భార్య రమ్యశ్రీ పనికి వెళ్లేది లేదా అని అడిగింది. అంతే ఆ మాటతో ఇద్దరూ మరోసారి గొడవపడ్డారు. గొడవ జరిగిన సమయంలో సంజీవులు తాగిన మైకంలో ఉండటంతో విచక్షణ కోల్పోయాడు. తాను మనిషిని అనే విషయాన్ని మర్చిపోయి ఓ మృగంలా ప్రవర్తించాడు.
అనథైనా చిన్నారి..
భార్యపై వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన భార్య ఐదు నెలల గర్భవతి అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోకుండా ఇంట్లో ఉన్న గొడ్డలితో రమ్యశ్రీని తలపై నరికాడు. భర్త గొడ్డలితో దాడి చేయడంతో స్పాట్లోనే మృతి చెందింది రమ్యశ్రీ. ఇది జరిగిన కొద్ది సేపటికే గ్రామంలోని పోచమ్మ దేవాలయం ప్రాంతానికి వెళ్లి తనకు తానుగా గొడ్డలితో తలపై నరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, గ్రామస్తులు వెంటనే సంజీవులును చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంజీవులు మృతి చెందాడు.
కాపురం కూల్చిన క్షణికావేశం..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్యశ్రీ మృతదేహాన్ని శవ పరిక్ష నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు కేస నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే పచ్చని కాపురం నెత్తుటి మరకలు చెరిపేయడం స్థానికుల్ని కలచివేసింది. క్షణికావేశంలో జరిగిన ఘటనతో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో నాలుగు సంవత్సరాల కూతురు సహస్రఅనాథగా మారింది. వృద్ధాప్యంలో ఉన్న సంజీవులు తల్లిదండ్రులు కొడుకు, కోడలు దూరమవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.