(P.Mahendar,News18,Nizamabad)
వ్యసనాలు తొలుత సాలెగూటి పోగులు..అటుపై ఉరితాళ్లు ఉన్న సామెత నిజమని నిరూపించాడు ఓ వ్యక్తి. తనకున్న దురలవాటుతో కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇది మంచి పద్దతి కాదని చెప్పిన భార్యను కడతేర్చారు. అత్యంత క్రూరంగా..ఉన్మాదంతో ఓ భర్త తన అర్ధాంగి ప్రాణాలు తీసిన ఘటన నిజామాబాద్(Nizamabad)జిల్లాలో అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 20ఏళ్లు(20Years) తనతో కలిసి కాపురం చేసిన భార్య మాటలకు కోపోద్రేకుడైన భర్త ఆమెను చంపి నేరస్తుడిగా మారాడు. భీమ్గల్ (Bhimgal)పట్టణం రాజారాంనగర్(Rajaramnagar Colony) కాలనీలో ఈ దారుణం జరిగింది.
మొగుడు కాదు యముడు..
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పురాణీపేట్కు చెందిన తెడ్ల నగేశ్ కులవృత్తి వడ్రంగి పని చేసుకుంటున్నాడు. భార్య లావణ్యతో కలిసి కొన్నేళ్లుగా భీమ్గల్ పట్టణం రాజారాంనగర్ కాలనీలో కాపురముంటున్నాడు. నగేష్, లావణ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు హైదరాబాద్లో సీఎం చేస్తోంది. కొడుకు లావణ్య సోదరి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. పిల్లలు దూరంగా ఉండటంతో కేవలం భార్య,భర్తలిద్దరు మాత్రమే ఒక అద్దె ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. కార్పెంటర్ వర్కర్ అయిన నగేష్ మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం తాగొచ్చి భార్య లావణ్యను వేధించసాగాడు.
మందు తాగొద్దన్నందుకు..
ఎప్పుడూ జరిగినట్లుగానే శనివారం కూడా రాత్రి మద్యం తాగొచ్చాడు నగేష్. ఇంట్లో భార్య, భర్తలు గొడవపడ్డారు. మద్యం తాగడం మానేయాలని భార్య లావణ్య నగేష్కి సూచించింది. ఆ మాటకు కోపంతో రగిలిపోయిన నగేష్ లావణ్య చీర కొంగుతో మెడకు చుట్టి ఉరితాడులా బిగించాడు. దాంతో ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. భార్యను ఊపిరాడకుండా చేసినప్పటికి తన కోపం చల్లారకపోవడంతో నగేష్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఉన్న ఇనుప ముక్కను కాల్చీ చేతులపై వాతలు పెట్టాడు. అటుపై ఆమె చేతులు విరిచాడు. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
అనాధలైన పిల్లలు ..
నగేష్, లావణ్య ఇంట్లో గొడవపడటం గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఆదివారం ఉదయాన్నే పోలీసులు సంఘటన స్తలానికి చేరుకున్నారు. మృతురాలు లావణ్య కాళ్లు, చేతులపై వాతలు పెట్టినట్లుగా గుర్తించారు. భర్త నగేష్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అక్క వీరమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నూరేళ్లు కంటికి రెప్పలా చూసుకుంటామని మూడ ముళ్లు వేసిన భర్త చెడు వ్యసనానికి అలవాటు పడిన భర్త కట్టుకున్న భార్య మంచి మాట చెప్పిందని అత్యంత కిరాతకంగా హతమార్చడంతో అతను జైలుపాలయ్యాడు. తల్లి చనిపోయిన, తండ్రి నేరస్తుడిగా మారడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. క్షణికావేశంలో చేసే నేరాలు ఎంతటి ప్రమాదకరంగా ఉంటాయో ఈ సంఘటన తెలియజేస్తుందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు దూరమైన బిడ్డల పట్ల స్థానికులు జాలి చూపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.