తెలంగాణ (Telangana )కు చెందిన యువకిరణం నిఖత్ జరీన్ (Nikhat zareen) చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ (World Women Boxing Championships Finals) పోటీల్లో 52 కిలోల విభాగంలో.. థాయ్ లాండ్ దేశానికి చెందిన జిట్ పాంగ్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి నుంచి నిఖత్ జరీన్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్ లతో విరుచుకు పడింది. కాగా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పసిడి సాధించిన ఐదే బాక్సర్ గా రికార్డు సాధించింది. గతంలో మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ ఎల్, లేఖ కేసీ మాత్రమే పసిడి పతకాన్నిసాధించారు. నిఖత్ జరీన్ (Nikhat zareen) సాధించిన అద్భుత విజయానికి ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా, తెలంగాణ లోని ఇందూరు (నిజామాబాద్) కు చెందిన నిఖత్ జరీన్ ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిఖత్.. ఇందూరు నుంచి ఇస్తాంబుల్ చేరడానికి చాలా ఏళ్ల శ్రమ దాగి ఉంది. మన ప్రపంచ చాంపియన్ జీవితాన్ని (About Nikhat zareen) ఒకసారి పరిశీలిస్తే..
పదో తరగతి వరకు నిజామాబాద్లో..
నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్-పర్వీన్ సుల్తానాల కూతురు జరీన్. నిఖత్ జరీన్ 1996 జూన్ 14న జన్మించింది. పొట్టకూటి కోసం జమీల్ గల్ఫ్ లో కొన్నాళ్లు సేల్స్ ఆఫీసర్ గా పని చేసి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పట్నుంచే బాక్సింగ్ మీద మక్కువ పెంచుకున్న జరీన్.. 13 ఏండ్లలో తన వయసు పిల్లలంతా వీధుల వెంబడి ఆడుకోవడానికి వెళ్తే తాను మాత్రం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుంది. పదో తరగతి వరకు నిజామాబాద్లోని నిర్మల హృదయ హైస్కూల్ (Nirmala Hridaya High School)లో చదివిన ఆమె కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. 15 ఏండ్ల వయస్సులోనే బాక్సింగ్ (Boxing) ప్రాక్టీస్ ప్రారంభించిన ఆమెకు తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది.
నిజామాబాద్ (Nizamabad) లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా పలు టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే ఈరోడ్ (తమిళనాడు) లో జరిగిన నేషనల్ ఛాంపియన్స్ లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’ అవార్డు పొందింది.
ఎక్కడ బాక్సింగ్ పోటీలు జరిగినా..
2011లో జరిగి ఉమెన్స్ యూత్ జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఎక్కడ బాక్సింగ్ పోటీలు జరిగినా కచ్చితంగా పతకం ఒడిసి పట్టుకోవడం అలవాటుగా చేసుకుంది. గత ఫిబ్రవరి నెలలో బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ పోటీల్లోనూ స్వర్ణ పతకం సాధించింది. నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడంతో నిజామాబాద్ జిల్లా సంబురాల్లో తేలుతోంది.
జరీన్ విజయాలు..
- 2011 లో టర్కీలో జరిగిన ఏఐబీఏ ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో జరీన్ స్వర్ణం నెగ్గింది.
- 2014లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ గెలుపొందింది..
- 2015 లో అసోంలో ముగిసిన 16వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.
- 2019 లో బ్యాంకాక్ లో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో సిల్వర్ మెడల్ సాధించింది.
- 2019, 2022 స్ట్రాంజ మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలలో స్వర్ణ గెలుచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.