Mahendar Penda, Nizamabad, News18
కూతురు పెళ్లి కుదిరిందని తల్లి దండ్రులు ఆనందపడ్డారు. మరో పది రోజుల్లో కూతురు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి సరిపడసామాగ్రీకోసం తండ్రి మార్కెట్ కువెళ్లాడు.. అయితే, ఆ తండ్రికి ఉన్నట్లుండి గుండె పోటు వచ్చింది.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
తండావాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగం పేట్ మండలంనారాయణ గూడ తండాకు చెందిన బుక్యా లచ్చిరామ్ (45), బుజ్జి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు సంతానం. అయితే రెండేళ్ల క్రితం ఇద్దరు కుమారులు జగన్ (10), శివ (8)ఆటవీశాఖ వారు తవ్విన కందకాల్లో పడి మృతి చెందారు.
ఆ బాధ నుంచి ఆ కుటుంబం తేరుకునేసమయంలోఅదే కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. జూన్ 3న పెద్ద కూతురు కల్యాణి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
పెళ్లి సామాగ్రీ కోసం లచ్చిరాం మంగళవారం గాంధారి మండల కేంద్రానికివెళ్లాడు. పెళ్లి సామగ్రి తీసుకుందామని తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. అదే సమయంలో లచ్చిరాంకు గుండెపోటు వచ్చింది.
వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లచ్చిరాం మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కొద్ది రోజుల్లో కూతురి పెళ్లి ఉండగా, తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండావాసులు సైతం కంటతడి పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Local News, Nizamabad, Telangana