(P.Mahendar,News18,Nizamabad)
ఈజీ మనీ కోసం అక్క, తమ్ముడు జట్టుకట్టారు. కళాశాలలే వారి టార్గెట్ గా చోరీలు చేశారు. ఏకంగా 18 సెల్ ఫోన్ లు కొట్టేసారు. చివరకు వాటిని విక్రయించేందుకు వెళుతూ దారి మద్యలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహించాం. అయితే ఇద్దరు బైక్ పై ఆనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద 18 స్మార్ట్ ఫోన్ లు లభించాయి. దీంతో వారిని పోలీసు పద్దతి ద్వారా ప్రశ్నించగా వారు అసలు విషయం చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెల్లాలకు చెందిన తన్నీరు ప్రభాకర్..అతని అక్క లక్కరాజుల చంద్రకళగా గుర్తించారు. వీరిద్దరూ ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్నారు.
కళాశాలలో పరీక్షలు జరిగే సమయంలో విద్యార్థుల స్మార్ట్ ఫోన్లు ఎత్తుకెళ్లడమే సులువైన మార్గం అనుకున్నారు. దీంతో కళాశాలలోని పరీక్ష కేంద్రాలే టార్గేట్ గా చేతివాటాన్ని ప్రదర్శించారు. తాజాగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతుండగా బయట పార్క్ చేసిన ఉన్న వాహనాల డీక్కిలోంచి ఏడు స్మార్ట్ ఫోన్లు దొంగిలించారు. ఎవరికి అనుమానం రాకుండా చంద్రకళ బురఖ ధరించింది.
ఈనెల 19న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని విజేత డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థుల బ్యాగుల నుంచి ఆరు స్మార్ట్ ఫోన్లు, 20న ఐదు స్మార్ట్ ఫోన్లు చోరీ చేశారు. ఇలా తొమ్మిది రోజుల వ్యవధిలో మొత్తం 18 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సెల్ ఫోన్లను హైదరాబాదులోని జగదీష్ మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తున్నామని నిందితులు చెప్పారు. 3 లక్షల నలభై ఐదు వేల విలువైన చేసే 18 చరవాణీలను స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Nizamabad, Telangana