పాములంటే (Snake) అందరికి భయమే. కోరలు చాచి కాటు వేస్తే చాలు ప్రాణాల మీదకు వస్తుంది. ఐతే పాములు పగబట్టి కాటువేస్తాయని అందరూ భావిస్తారు. శాస్త్రవేత్తలు అలాంటిదేమీ లేదని చెప్పినా.. పాము ఇంటికి వస్తే పగబట్టే వచ్చిందంటూ హడలిపోతుంటారు. పాములు పగబట్టవనే దానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాములకు జ్ఞాపకశక్తి తక్కువని అందుకే అవి పగబట్టవని.. వాటికి చెవులు కూడా ఉండవని అందుకే మాటలను గ్రహించి వెంటాడే అవకాశమే లేదని చెబుతున్నారు. అయితే తాజాగా ఓ విద్యార్థి (Student) ఒకటి రెండూ కాదు మూడుసార్లు పాము కాటుకు (Snake Bite) గురయ్యాడు.
కామారెడ్డి (Kamareddy) జిల్లా పెద్ద కొడప్గల్లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణకు శుక్రవారం ఉదయం పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్గల్లోని బాలుర సంక్షేమ హాస్టల్లో ఇదే విద్యార్థికి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
గతంలో ఏపీలో ..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ఓ పల్లెలో మాత్రం ఓ పాము.. ఓ కుటుంబాన్ని పగబట్టిందట. ఆ ఇంట్లోని వాళ్లు తరచూ పాముకాటుకు గురవుతుండటంతో నిజంగానే నాగరాజు వారిని వెంబడిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా (Chittoor District) తిరుపపతి సమీపంలోని ధోర్ణకంబాల ఎస్టీకాలంలో వెంకటేష్ వెంకటమ్మ అనే దంపతులు నివాసముంటున్నారు. వారు కుమారుడు జగదీష్, తండ్రి గురవయ్యతో కలిసి ఉంటున్నారు. గ్రామ పొలిమేరల్లో గుడిసె వేసుకొని ఊరూరా తిరుగుతూ బండిపై ఐస్ క్రీమ్ అమ్ముకొని జీవిస్తున్నారు. ఐస్ క్రీమ్ బండి తీయని సమయంలో కూలిపనులకు వెళ్తుండేవాడు. ఆ డబ్బుతోనే కుమార్తెతో పాటు కొడుకుని చదువిస్తున్నాడు.
ఐతే వీరి జీవితంలో అనుకోని ఘటన ఎదురైంది. వెంకటేష్ తన ఇంటి ఆవరణలో కూరయాగలు, పూలమొక్కలు నాటి పెంచుతున్నాడు. ఓ రోజు మొక్కల దగ్గర శుభ్రం చేస్తుండగా కత్తి చేతులో నుంచి జారి పాముపై పడింది. దీంతో అది అక్కడి నంచి వెళ్లిపోయింది. ఐతే పాము విషయాన్ని వెంకటేష్ పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకు రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఇంటికి వచ్చిన పాము గుమ్మంలో నిద్రిస్తున్న గురవయ్యను కాటు వేసింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.
ఆ రోజు నుంచి నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది సార్లు ఒకరి తరువాత ఒకరిని పాము కాటు వేయడం ఆసుపత్రిలో చేరడం అదే తంతుగా మారిపోయింది. గతంతో వెంకటేష్, వెంకటమ్మ, గురవయ్యలను రెండేసి సార్లు కాటు వేయగా.. జగదీష్ ను మూడు సార్లు కాటు వేసింది. పాము కాటు వేసి ప్రతిసారి స్థానికులు సకాలంలో స్పందించి 108కు కాల్ చేయడం హాస్పిటల్ కు తరలించడం వారు ప్రాణాలతో బయటపడటం జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.