(న్యూస్ 18, తెలుగు ప్రతినిధి, పి మహేందర్)
నిజామాబాద్ ఎంపీ అరవింద్ (Nizamabad MP Aravindh)పై జరిగిన దాడి ఘటనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Telangana BJP Chief Bandi Sanjay) తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)లో భయం మొదలైందని, ఆ కారణంగానే దాడులకు తెగబడుతున్నారని సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి ఆని ఎంపీ బండి సంజయ్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఎంపీ అరవింద్ కాన్వాయ్ లో ఉన్న కార్యకర్తలపై దాడిలో గాయపడ్డ బీజెపీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన నిజామాబాద్ బయలుదేరి వచ్చారు. ఆయనతో పాటు ఎంపీలు అరవింద్, స్వయం బాబురావు, MLA రఘునందన్రావు, పార్టీ నాయకులు వచ్చారు. అనంతరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాటే..
ఎంపీ అరవింద్పై దాడి చేస్తారని డీజీపీ మహేందర్ రెడ్డికి, సీపీ నాగరాజు, ఇంటెలిజెన్స్ అధికారులకు తెలిసినా పోలీసులు (Police) రక్షణ కల్పించలేదని సంజయ్ ఆరోపించారు. నిజామాబాద్ సీపీ నాగరాజు డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డారని, హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఫిబ్రవరి 3 న ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో వారి సంగతి తెలుస్తామన్నారు. ఆర్మూర్ (Armor) ఘటనను కూడా ప్రివిలేజ్ కమిటీకి పిర్యాదు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటుందని జోస్యం చెప్పారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు చట్టం పరిధిలో పని చేయాలని, చట్టంకు వ్యతిరేకంగా పని చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు సంజయ్.
రాజ్యాంగ పదవులను అవమానపర్చడమే..
రాష్ట్రంలో కొంత మంది ఐపీఎస్ లు, ఐఏఎస్ లు అసంతృప్తిలో ఉన్నారని, కొంత మంది అధికారులు సీఎం కేసీఆర్ మోకాలి చిప్ప నీళ్లు తాగుతున్నారని సంజయ్ ఆరోపించారు. గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరుకాకపోవడం రాజ్యాంగ పదవులను అవమానపర్చడమే అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు హద్దులలో ఉండి అభివృద్ధికి పాటుపాడాలని సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ కు మానవత్వం ఉంటే సీపీ పై కేసు నమోదు చేసి, ఎంపీ పై హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డిప్రెషన్ కు వెళ్లారని అందుకే బీజెపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ సారి బీజేపీకి అవకాశం ఇస్తారని...
పార్లమెంట్ పరిధిలో తిరిగే హక్కు ఎంపీలకు ఉంటుందని, అలాంటిదే వారికి రక్షణ లేకుంటే ఎలా ఉంటుందన్నారు సంజయ్ . కరీంనగర్ లో నాపై పోలీసులు దాడి చేశారు. ఎప్పుడు ఎంపీ అరవింద్ పై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ సారి బీజేపీకి అవకాశం కల్పించాలని భావించడంతో బీజేపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్నారని సంజయ్ ఆరోపించారు. కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఊరుకోమని రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలని చెప్పారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైన వెళతామన్నారు..
గవర్నర్ ఫోన్ చేశారు..
తనకు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేశారని.. ఫోనులో గవర్నర్ దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారని ఎంపీ అరవింద్ చెప్పారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోలీస్ లు తీరును ఎంపీ వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని, దాడి జరిగే అవకాశం ఉందని ముందు రోజు, మరుసటి రోజు తెలిపినా, రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని చెప్పారు. తన స్వంత నియోజక వర్గంలో పోలీస్ లు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు ఎంపీ తెలిపారు. ఈ మధ్య కాలంలో గౌరవ పార్లమెంట్ సభ్యులపై, ఇతర ప్రజా ప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే, కొన్ని సార్లు పోలీసులే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీ తో, కేంద్ర హోమ్ శాఖతో చర్చించి, తగు చర్యలకు సూచిస్తానని హామీ ఇచ్చారని ఎంపీ అర్వింద్ చెప్పారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Nizamabad, Telangana bjp