(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టిందో లేదో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా కరోనాతో అల్లాడిన నిజామాబాద్ జిల్లా వాసులు.. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలతో బెంబేలెత్తుతున్నారు. రోజురోజుకు విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా మూడోవేవ్ రావొచ్చని హెచ్చరిస్తున్న తరుణంలో.. విషజ్వరాలు జిల్లాను చుట్టుముట్టడం ఆందోళన కలిగిస్తోంది. వారం వ్యవధిలో.. 17 డెంగ్యూ, 9 చికెన్ గున్యా కేసులు నమోదు కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇంటింటి సర్వేకు ఆదేశించారు. రాష్ట్రంలోనే అత్యధిక డెంగ్యూ కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదవ్వడంతో కీటక శాస్త్ర వేత్తల బృందం పర్యటించి దోమల లార్వా సేకరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇలా ఉంది.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 100 మందికి పైగా చికెన్ గున్యా, డెంగ్యూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రిలోను జ్వర పీడితులు కిక్కిరిసిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.. ఫలితంగా కోవిడేతర జ్వరాలు విజృంభించాయి. డెంగ్యూ అని ప్రైవేట్ ల్యాబ్స్ అంటుంటే ఎలీసా టెస్ట్ చేస్తేనే డెంగ్యూ అంటోంది ఆరోగ్యశాఖ అధికారులు. గతంలోను రాష్ట్రంలోనే అత్యధిక డెంగ్యూ కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి.
ఈ సారి సీజన్ ప్రారంభంలోనే డెంగ్యూ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సారంగాపూర్ లో 9 మంది చికెన్ గున్యా, డెంగ్యూ బారిన పడటంతో రాష్ట్ర స్దాయి అధికారులు నిజామాబాద్ పై ఫోకస్ పెట్టారు. జిల్లాలో కీటక శాస్త్రవేత్తల బృందం పర్యటించి.. చికెన్ గున్యా, డెంగ్యూ దోమ కారక ఏడిస్ దోమలు గుర్తించారు. మూడురోజులుగా జ్వారం తగ్గలేదు.. దీంతో ఆసుపత్రిలో చూపించుకుని మందులు తిన్న జ్వరం తగ్గకపోగా బాడీ పెయిన్స్ వచ్చాయని లక్ష్మి అనే మహిళ చెబుతుంది. తమ కాలనీలో ఆశ వర్కర్ కు విషయం చెప్పాను ఆమె వారం రోజుల క్రితం రక్త పరీక్ష చేసి నీకు చికెన్ గున్యా వచ్చిందని చెప్పింది. దీంతో వారు ఇచ్చిన మందులు వాడుతున్నానని చెప్పింది. ఇప్పటి వరకు కరోనా అని బయపడే వారిమి ఇప్పుడేమో చికేన్ గున్యా అంటున్నారని వాపోయింది. జ్వర పీడితులతో ఆసుపత్రులు కిక్కిరిస్తున్నాయి. ఇటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులతాకిడి పెరిగింది. కరోనా పూర్తిగా తగ్గకముందే డెంగ్యూ వ్యాధి , చికెన్ గున్యా విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల నీరు కలుషితం కావడం, దోమలు వృద్ధి చెందడం వల్లే డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలిసా పరీక్ష చేసి నిర్ధారిస్తేనే ప్రభుత్వ వైద్యులు డెంగ్యూ అని నిర్ధారిస్తారు. ఆర్మూర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలిసా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరు టెస్టులు చేసుకోకపోవడం ... మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులలో వేరే పద్ధతిలో పరీక్ష చేయడంతో గతంలో ఉన్నట్టే డెంగ్యూ పై విభిన్న వాదనలు వినపడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో చేసే నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ వైద్యులు గుర్తించడం లేదు. తీవ్రంగా జ్వరం వచ్చిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడంలేదు. నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. మరీ తీవ్రంగా జ్వరం ఉంటే నిజామాబాద్, హైదరాబాద్ ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు. ఇందులో చేరిన రోగులను డెంగ్యూ రోగులుగా గుర్తించడంలేదు. రెండేళ్ల క్రితం డెంగ్యూ వ్యాధి జిల్లా ప్రజలను గడగడ లాడించింది. ఈ వ్యాధి సోకిన వారికి పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చింది.
అప్పటి పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూకి, కరోనాకు రెండింటికీ జ్వరం వస్తోంది. ఈ రెండు కూడా ప్ర మాదకరమైన వ్యాధులే... రెండూ ఏకకాలంలో ప్రభావం చూయిస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. జ్వరం వస్తేనే భయాందోళన చెందుతున్నారు. కరోనా కేసులు కూడా అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలపై అప్రమత్తంగా ఉన్నామని జనాలకు చైతన్యం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంటింటి సర్వే తో జ్వర పీడితులను గుర్తిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అధికారులు. సారంగపూర్ లో 25మందికి రక్త నమునాలు తీసుకుని పరిక్షించాము అందులో 8మందికి చికేన్ గున్యా, ఒకరి డేంగ్యు వచ్చిందని వైద్యాధికారి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dengue fever, Fever, Nizamabad