అక్రమాలను తొలగించి సక్రమంగా రికార్డులు రూపొందించమంటే అక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బులను జీతాల రూపంలో తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కొందరు అధికారులు చేసిన నిర్వాకం వల్ల ఓ గ్రామానికి చెందిన రైతులు(Farmers)ప్రభుత్వం అందించే రైతు బంధు, రైతుభీమా వంటి ఆర్ధిక సాయాన్ని కోల్పోయారు. కామారెడ్డి (Kamareddy)జిల్లాలోని ఎల్లారెడ్డి (Ellareddy)మండలం వెంకటాపూర్-అగ్రహార్ (Venkatapur-Agrahar)గ్రామానికి చెందిన రైతుల గోడు ఇది. భూమి పత్రాల సర్వే సమయంలో జిల్లా అధికారులు ఊళ్లో ఉన్న భూములన్ని దేవాదాయ భూములు(Orchards)గా రికార్డుల్లోకి ఎక్కించారు. దాని ఫలితంగానే వెంకటాపూర్-అగ్రహార్ గ్రామంలో పట్టాదారు పుస్తకాలు, పొలం దస్తావేజులు ఉంచుకొని దశాబ్ధాలుగా సాగుచేస్తున్న రైతులు కౌలురైతులుగా మిగిలిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం పంటసాయం కింద ఇచ్చే రైతుబంధు, రైతు చనిపోతే ఇచ్చే రైతు భీమా వంటి పథకాలు గ్రామానికి చెందిన ఏ రైతు నోచుకోవడం లేదు.
రికార్డుల ప్రక్షాళ పేరుతో..
గ్రామంలో 180 ఎకరాల్లో సాగు భూమి ఉండగా..50 ఎకరాల్లో గ్రామం ఉంది. గ్రామంలో 225 మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. 180 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. రైతులు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలను సైతం అందజేసింది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకుల్లో ఉంచి పంట రుణాలు పొందుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కారణంగా రైతుల పాత పాస్ పుస్తకాలు అటకెక్కాయి. డిజిటల్ పాస్ పుస్తకాల కోసం రైతులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు ఇక్కడి రైతులకు పాలిట శాపంగా మారింది.
రైతుల నోట్లో మట్టికొట్టారు..
ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయానికి చెందిన 5ఎకరాల భూమి ఈ గ్రామంలో ఉంది. మిగిలిన భూములన్నీ పట్టాలున్నవే. అయితే ఊరి పేరులో ఉన్న అగ్రహార్ కారణంగా గ్రామం మొత్తాన్ని దేవాదాయశాఖకు చెందినదిగా ధ్రువీకరిస్తూ అధికారులు ఆరేళ్ల క్రితం నోటిఫైడ్ చేశారని గ్రామస్తులంటున్నారు. రెవెన్యూ సెటిల్ మెంట్ రికార్డులో ఆలయానికి భూములున్నట్లుగా నిర్ధారించినప్పటికీ ఏ సర్వే నెంబర్లలో ఉన్నాయో ధ్రువీకరించలేదు అధికారులు. ఫలితంగా మొత్తం ఆలయ భూములేనని నోటిఫైడ్ చేసినట్లు తెలుస్తోంది. అధికారులు చేసిన పొరపాటు కారణంగా రైతులు నిజామాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. ఏడాదిన్నర క్రితం వారికి అనుకూలంగా ప్రాథమిక తీర్పు వెలువడింది. అయినప్పటికీ పట్టాలు మంజూరు కావడం లేదు. రెవెన్యూ, దేవా దాయశాఖల అధికారులు కలిసి పరిశీలిస్తేనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు అంటూన్నారు.
సర్కారు సాయం అందక బేజారు..
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు దేవాదాయ శాఖ భూములుగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లే తాము ప్రభుత్వం అందజేస్తున్న ఏ సంక్షేమ పథకానికి నోచుకోకుడాపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వెంకటాపూర్ అగ్రహార్ లోని భూములను దేవాదాయశాఖవిగా పేర్కొంటూ.. నోటీసులు జారీ చేయడంతో డిజిటల్ పట్టా పాస్ పుస్తకాల పంపిణిని నిలిపివేశామన్నారు ఆర్డీఓ శ్రీనివాస్. గ్రామంలో ఒకటి నుంచి162 సర్వేనంబర్ లోని భూములన్ని కూడా దేవాదాయశాఖగా చూపిస్తున్నాయి. గ్రామంలోని భూములకు సంబంధించిన రెవెన్యూ దస్త్రాలను పరిశీలించి వాస్తవ పరిస్ధితిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆర్డీఓ వివరణ ఇచ్చారు.
రెంటికి చెడ్డ రైతులు..
గ్రామంలో ఉన్న భూమంతా దేవునివే అని అధికారులు చెబుతుంటే ఐదు ఏకరాలు మాత్రమే దేవుడి భూమి అంటున్నారు గ్రామస్తులు. దీంతో పంచాయితీ గ్రామస్తులు వర్సెస్ అధికారులు అనే చందంగా మారిపోయింది. భూమిపై హక్కుల కోసం గ్రామానికి చెందిన రైతులు ఎంతవరకైనా పోరాడతామంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, Kamareddy