ఎలాంటి అనుమతులు లేకున్నా లక్కీ డ్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. నెలనెలా స్కీము పేరుతో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. పేదల ఆశలను పెట్టుబడిగా చేసుకుని దోచుకుంటున్నారు. వేలల్లో సభ్యులను చేర్చుకుని కోట్లలో సంపాదిస్తున్నారు. తాజాగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఓ లక్కీ డ్రా మోసం బహిర్గతం అయింది. ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ స్కీమ్ పూర్తయినా బహుమతులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకో చోట లక్కీ డ్రా మోసాలు బయటపడుతున్నాయి. వేలల్లో సభ్యులను చేర్చుకుని మొదట డ్రాలో వచ్చిన వారికి బహుమతులు ఇస్తారు. తరువాత వారికి కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేస్తున్నారు. ఇలాంటి కేసులు జిల్లాలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పేరుతో కొందరు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ధనలక్ష్మి 2, 3, 4 అని మూడు స్కీములు ఏర్పాటు చేశారు. 2, 3 స్కీముల వ్యవధి పదహారు నెలలు కాగా 4వ స్కీము 10 నెలలుగా నిర్వాహకులు నిర్ణయించారు. ఒక్కొక్క స్కీముకు ప్రతి నెలా వెయ్యి, రెండు వేల చొప్పున వసూలు చేశారు. ఒక్కొక్క గ్రామం నుంచి సుమారుగా 50 నుంచి 100 మంది స్కీములో చేరారు. ఇలా దాదాపుగా సుమారు 50 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూడు స్కీములు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు బాధితులకు రావాల్సిన బహుమతులు ఇవ్వలేదు.
లక్కీ డ్రా తీసే సమయంలో అనుమతి లేదంటూ ఎవరిని రానీయలేదని బాధితులు చెప్తున్నారు. డ్రాకు సంబంధించి వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పంపించారని బాధితులు తెలిపారు. ఆ వీడియోలో డ్రాలో గెలుపొందిన వారు ఆదివారం కామారెడ్డికి వచ్చి బహుమతులు తీసుకెళ్లాలని వాట్సాప్ గ్రూపులో సమాచారం అందించారు. దీంతో.. సుమారు 100 మంది బాధితులు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల ఓ హోటల్ వద్ద ఏజెంట్లు, నిర్వాహకులను కలిశారు. లక్కీ డ్రాలో టీవీ వచ్చిన వారికి వాషింగ్ మిషన్ ఇస్తున్నారని బాధితులు తెలిపారు. డ్రాలో వచ్చినవి కాకుండా వారికి నచ్చిన వాటిని ఇస్తున్నారని తెలిపారు. అయితే స్కీములో ఒక్కొక్కరు సుమారు 30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించారు. తీరా డ్రాలో వచ్చిన వస్తువులు కాకుండా వారికి నచ్చినవి ఇవ్వడంతో నిర్వహకులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వచ్చిన బహుమతులు మాత్రమే ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో పది రోజుల్లో ఎవరి వస్తువులు వారికి ఇస్తామని చెప్పి బాధితులను సముదాయించి అక్కడినుంచి పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Nizamabad District