(Nagaraju,News18, Nalgonda)
నేటి ట్రెండ్కి తగ్గట్టుగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. స్వయం ఉపాధి ద్వారా అవకాశాలు సృష్టించుకుంటూ వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మహిళలు. ఆకోవకు చెందిన మహిళే నల్లగొండ(Nalgonda)పట్టణానికి చెందిన మైలవరపు ధనలక్ష్మీ(Mylavarapu Dhanalakshmi).ఆధునిక కాలంలో సృజనాత్మక కళాకృతులతో తయారు చేసిన మహిళల దుస్తులకు డిమాండ్ పెరగడంతో.. ఆదిశగా అడుగులు వేసి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు ధనలక్ష్మి. మహిళల చీరలు, డ్రెస్సులపై డిజైన్లు వచ్చేలా..ఎలక్ట్రానిక్ డిజైనర్ మగ్గంను ప్రారంభించి మంచి ఆదాయం పొందుతున్నారు. స్వయం ఉపాధితో తన కాళ్లమీద తాను నిలబడుతునే మరో 25 మందికి ఉపాధి కల్పిస్తున్నారు ధనలక్ష్మి. ఇంతకు ధనలక్ష్మీ ప్రారంభించిన వస్త్ర వ్యాపారం గురించి తెలుసుకోవాలంటే ఈస్టోరి చదవండి!
ట్రెండ్ను అందిపుచ్చుకుంటే అన్ని అవకాశాలే:
ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్న ఆయా అంశాల పట్ల పట్టు సాదించాలి. సాఫ్ట్వేర్ అయితే ఎప్పటికప్పడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, వ్యాపారులైతే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఇలా ఏ ట్రెండ్కు తగ్గట్టుగా మనం మారితే అంతలా అవకాశాలను నిలబెట్టుకోగలం. ప్రస్తుత కాలంలో మహిళల చీరలు, డ్రెస్సులలో అందమైన ఆకృతులకు డిమాండ్ పెరిగింది. ట్రెండ్కు తగ్గట్టుగా దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం పరిపాటిగా మారింది. దీంతో నల్లగొండ పట్టణానికి చెందిన మైలవరపు ధనలక్ష్మీ..వినూత్న ఆలోచనతో పట్టణంలో మొట్టమొదటగా మగ్గం వర్క్స్ దుకాణాన్ని ప్రారంభించింది. అందమైన డిజైన్స్తో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాన్ని మొదలెట్టింది. నగరాలు, పెద్ద పట్టణాల్లో మహిళలకు పరిచయమైన ఈ తరహా డిజైన్లు, స్థానిక మహిళలకు చేరడానికి కొంత సమయం పట్టింది. మొదట్లో తన డిజైన్లు, వ్యాపారం గురించి తెలిసిన వారి ద్వారా స్థానిక మహిళలకు వివరించసాగింది ధనలక్ష్మి. ధనలక్ష్మి తయారు చేస్తున్న డిజైన్లు నచ్చడంతో, మహిళలు ఆర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారు.
ఏడాదికి రూ. 50 లక్షల వ్యాపారం:
ధనలక్ష్మి ప్రారంభించిన మగ్గం వ్యాపారం ఏదో మొక్కుబడి వ్యాపారం కాదు. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమను మించి టర్నోవర్ సాధిస్తున్నారు ధనలక్ష్మి. తను పదేళ్ల క్రితం మొట్టమొదటగా ముగ్గురుతో మగ్గం వర్క్స్ ప్రారంభించానని.. నేడు ఆసంఖ్య 25కి చేరిందన్నారు. ఏడాదికి రూ. 50 లక్షల టర్నోవర్ సాధిస్తున్నామని ధనలక్ష్మి న్యూస్ 18 ప్రతినిధికి వివరించారు. ఏడాదికి 50 లక్షల వ్యాపారం చేసినా.. అన్ని మెటిరియల్స్ ఖర్చులు పెరగడమే కాక.. వర్కర్స్క్ జీతాలు పెరగడంతో అన్ని పోనూ నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల ఆదాయం మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. తనకూ వ్యాపారం చేయడం ఇష్టమని ఈవిషయాన్ని తన భర్త గ్రహించి ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది.
శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లు:
శుభకార్యాలకు,వేడుకలకు ప్రత్యేకంగా డిజైన్స్ రూపొందించడం...ఇక్కడి మగ్గం వర్క్స్ ప్రత్యేకత. వివాహం, శారీ ఫంక్షన్లు ఇతర వేడుకలకు ప్రత్యేకంగా దుస్తులు తయారు చేస్తున్నారు ధనలక్ష్మి. ఆర్డర్స్ను బట్టి కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దుస్తులు డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. అతివల మనస్సుకు నచ్చినట్లుగా మగ్గం, జర్దోషి, జరివర్కు చేయించడంతో పాటు డిజైనర్ బ్లౌజ్ కుట్టించడం జరుగుతుంది. డిజైన్ బట్టి రేట్లు ఉంటాయని మగ్గం నిర్వాహకురాలు మైలపురపు ధనలక్ష్మీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda