(Nagaraju, News 18, Nalgonda)
నల్లగొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి పరిధిలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని యువకుడు మృతిచెందాడు. నార్కట్ పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన కాసర్ల నరేందర్ రెడ్డి గురువారం తన ద్విచక్ర వాహనంపై నల్గొండ వచ్చాడు. తన పని ముగించుకుని తిరిగి అదే ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తుండగా...చర్లపల్లి ప్రాంతంలో రోడ్డుపై చెట్లకు నీళ్లు పెడుతున్న వాటర్ ట్యాంకర్ను వెనక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో నరేందర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. చెరువులో మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతురాలు పట్టణంలోని నెహ్రునగర్ చెందిన గండెల ఉపేంద్రగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా మెకాళ్ల నోప్పులు కాళ్ల వాపుతో బాధపడుతున్న ఉపేంద్ర, తట్టుకోలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిన ఉపేంద్ర, కోసం కుటుంబ సభ్యులు గాలించారు. గురువారం నాడు ఇలా చెరువులో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గరిడేపల్లి మండలం తాళ్ళమల్కాపురం గ్రామ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తోడల్లుడు ట్రాక్టరుతో తొక్కించి హతమార్చేందుకు ప్రయత్నించినా ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఎస్సై కొండల్ రెడ్డి కధనం మేరకు, తాళ్ళమల్కాపురం గ్రామానికి చెందిన బత్తిని కన్నయ్యను, తోడల్లుడు (కన్నయ్య భార్య చెల్లెలి భర్త) చెరుకు రామకృష్ణ ట్రాక్టరుతో తొక్కించి హత్యా ప్రయత్నం చేశాడు. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భూ వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda, Telangana, Telangana crime news