(Nagaraju,News18, Nalgonda)
సాంకేతికత పరంగా మనం ఎంత ముందుకు సాగుతున్నా..వ్యవసాయ రంగంలో మాత్రం అడుగు ముందుకు పాడడం లేదు. పాత పద్ధతుల్లో వ్యవసాయం వలన అన్నదాతలకు ఎక్కువ శ్రమ, పెట్టుబడి వ్యయం అవుతుండగా..దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈక్రమంలో వరిసాగులో సాంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి..కొత్త విధానంతో ముందుకు వెళ్తున్నారు నల్లగొండ జిల్లా రైతులు. సంప్రదాయ వరి సాగుకు భిన్నంగా నీటి వినియోగం, పెట్టుబడి వ్యయం తగ్గించుకొని పర్యావరణ హితంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ రైతులు మెట్టపద్దతిలో వరి సాగు చేస్తున్నారు. మాములు పద్దతిలో వచ్చే దిగుబడులు కంటే మెట్ట వరిలో అధిక దిగుబడి వస్తుందంటున్నారు అన్నదాతలు. ఈక్రతువుకు రైతులకు అండగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నిలుస్తోంది. అసలు ఏంటి మెట్ట పద్దతి విధానం! దాని ప్రయెజనాలు ఏంటో తెలుసుకుందాం!!
మెట్ట వరిసాగుతో సత్ఫలితాలు:
తెలంగాణలో నూతన పద్ధతిలో వరిసాగుకు నల్లగొండ జిల్లా వేదికగా మారింది. నీటి వినియోగం, పెట్టబడి వ్యయం తగ్గించడంతో పాటు పర్యావరణ హితంగా వరిసాగు చేసేందుకు..గత ఏడాది ప్రయోగత్మకంగా 380 ఎకరాల్లో చేపట్టిన మెట్ట వరిసాగు విధానం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో జిల్లా రైతులు నూతనోత్సహంతో పెద్ద ఎత్తున ఈవిధానానికి మొగ్గు చూపడంతో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో మెట్ట వరి సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా మడిసాగు విధానానికి అలవాటు పడ్డ రైతులను ఇలా మెట్ట వైపు దృష్టి పెట్టడం వెనుక డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కృషి ఉందని చెప్పవచ్చు.
డాక్టర్ రెడ్డీస్ సహాకారంతో మెట్ట విధానం అమలు:
సాధారణంగా వరి సాగు చేయాలంటే నారుపోసి, మడుల్లో నీటిని నింపి, దమ్ము చేసిన తర్వాత బురదలో నాట్లు వేస్తారు. ఇది సాంప్రదాయ పద్ధతి. ఇందులో నీటి వినియోగం అధికంగా ఉండడంతో పాటు పెట్టుబడి వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (వాతావరణ విభాగం) ప్రతినిధులు ముందుకు వచ్చి, మెట్ట వరిసాగు విధానం పై రైతులకు అవగాహన కల్పించారు. అన్నదాతలతో కలిసి వరి సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ హితంగా ఉండేందుకు మెట్టవిధానాన్ని ప్రయోగత్మాకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్లో అమలు చేశారు. ఈపద్థతిలో వర్షకాలం ప్రారంభానికి ముందు భూమిని చదును చేసి తొలకరి ప్రారంభం తర్వాత ట్రాక్టర్ యంత్రం సాయంతో భూమిలో విత్తనాలు చల్లి వరిని పండిస్తారు.
గత ఏడాది 380 ఎకరాల్లో వరిసాగు:
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రోద్బలంతో గత ఏడాది వానాకాలం సీజన్లో మిర్యాలగూడ డివిజన్ త్రిపురారం మండలంలో 380 ఎకరాల్లో మెట్ట పద్ధతిలో వరిసాగు చేశారు అన్నదాతలు. మంచి దిగుబడి రావడంతో.. అదే నూతనోత్సహాంతో ఈఏడాది పది మండలాల్లో దాదాపు పది వేల ఎకరాల్లో మెట్టపద్ధతిలో వరి సాగు చేయాలని రైతులతో కలిసి రెడ్డీస్ ఫౌండేషన్ నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో రైతుల భూముల ఎంపిక..విత్తనాల సరఫరాను పూర్తి చేసింది. రుతుపవనాలు రాష్ట్రానికి రావడంతో భూముల్లో విత్తనాలు విత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
'ఇరి' భాగస్వామ్యంతో సాగుకు సన్నాహాలు:
ఫిలిప్పిన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఈనూతన మెట్ట విధానంపై రైతులను ప్రోత్సహిస్తోంది. వరిసాగులో ఫిలిప్పిన్స్ ఇరి సభ్యదేశాల శాస్త్రవేత్తల సూచనలు సలహాలతో సంప్రదాయ సాగుకు భిన్నంగా సాగు చేయడంతో ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్ల దిగుబడులు పెరగడంతో రైతులు.. ఈ ఏడాది ముందుకువచ్చారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈదఫా పరిశోధన సంస్థలో శిక్షణపొందిన ప్రతినిధులు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండనున్నట్లు రైతులు తెలిపారు.గత వానాకాలం సీజన్లో మెట్టపద్ధతిలో వరి వేస్తే అధిక దిగుబడి వచ్చినట్లు ఫౌండేషన్ ప్రతినిధి వీరాస్వామి చెప్పుకొచ్చారు. పెట్టుబడి వ్యయం కూడా చాలావరకు తగ్గినట్టు వెల్లడించారు. భూమిలో విత్తనాలు విత్తిన పక్షం రోజులు పాటు సాగును సరిగా చూసుకుంటే దిగుబడి సైతం అధికంగా వస్తుందని వీరాస్వామి వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda