(Nagaraju,News18, Nalgonda)
జీవితంలో ఒక వ్యక్తికి పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని అనేక సందర్భాల్లో రుజువైంది. అయితే శారీరకంగా, మానసికంగా కృతనిశ్చయంతో ఉన్నవారే అటువంటి విజయాలు సాధిస్తున్నారు. కానీ, సంకల్పం బలం ఉండాలేగానీ..శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. ఓ వైపు అంగవైకల్యం వెక్కిరిస్తున్నా..తనలోని ప్రతిభను చాటిచెప్పాలని ప్రయత్నిస్తూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా దాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నల్లగొండ(Nalgonda)జిల్లా చందంపేట(Chandampeta)మండలం మూడుదండ్ల(Mududandla) గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మ తండా(Dharma Tanda)కు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్(Ramawath Koteshwar Nayak).. ఆటలపై తనకున్న ఇష్టంతో అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. సాధారణ వ్యక్తులకు ధీటుగా క్రీడల్లో రాణిస్తు, రాష్ట్ర(State),జాతీయ(National) స్థాయిలో పతకాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు.
చిన్న నాటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం:
రమావత్ కోటేశ్వర్ నాయక్కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. నాయక్ తల్లిదండ్రులు తావుర్యా, భారతి వ్యవసాయ కూలీలు. శారీరక వైకల్యానికి తోడు కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో ఆటలపై ఇష్టాన్ని వదులుకుని చదువుపై దృష్టిపెట్టాడు. కోటేశ్వర్ నాయక్ ఇంటర్ వరకు దేవరకొండలో చదివాడు. హైదరాబాదులో గచ్చిబౌలిలోని రోడ్ మిస్ట్రీ కళాశాలలో డిగ్రీ చదివాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంఎస్డబ్ల్యూ పూర్తిచేశాడు. పాఠశాల స్థాయిలో ఆటలపై ఉన్న ఆసక్తితో తన తోటి స్నేహితులతో క్రికెట్ ఆడేవాడు కోటేశ్వర్ నాయక్. అప్పటికి అది సరదా కోసమే ఆడినా..అనంతరం డిగ్రీ చదివే రోజుల్లో మిత్రుడు శంకర్ ప్రోత్సాహంతో విల్చైర్ ఆటపై దృష్టి పెట్టాడు. చిన్నగా ఆటపై పట్టు సాధించిన కోటేశ్వర్ నాయక్ అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని జట్టుకు విజయాలు అందించాడు.
వీల్చైర్పై క్రికెట్ బాస్కెట్బాల్ ఆటల్లో ప్రావీణ్యం సంపాదించిన కోటేశ్వర్ నాయక్, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నాడు. 2019లో థాయిలాండ్లో జరిగిన ఏషియన్ ఒషియన్ చాంపియన్ టోర్నమెంట్లో ఆడి విజేతగా నిలిచాడు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన వీల్చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ల్లో \"నేమ్ అఫ్ ది సిరీస్\" ఆడి బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మ్యాన్గా నిలిచాడు. ఇటీవల సౌత్ జోన్ కోయంబత్తూర్లో జరిగిన వీల్చైర్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని రన్నరప్గా నిలిచాడు. ఐదు రాష్ట్రాల టీంలో పాల్గొనగా బెస్ట్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. జూన్ 21 నుంచి 25 వరకు ఢిల్లీలోని ద్వారకలో జరిగే హైదరాబాద్ సన్గ్రేస్ టీమ్ నుంచి వీల్చైర్ బాస్కెట్ బాల్ పోటీలో పాల్గొననున్నాడు.
చిన్నతనంలో నవ్విన స్నేహితులే నేడు భుజం తడుతున్నారు:
\"ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ ఆడేవాడిని. నా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే నన్ను చేర్చుకునేవారు కాదు. వారిని బ్రతిమిలాడి ఆడే వాడిని. అంగవైకల్యం ఉన్నా రోజూ వారితో సమానంగా ఆడేవాడిని. ఆ తర్వాత వీల్చైర్ గేమ్స్పై దృష్టి పెట్టాను\" అంటూ తన చిన్న నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు కోటేశ్వర్ నాయక్. శంకర్ అనే మితృడి ప్రోత్సాహంతో తెలంగాణ టీమ్స్లో పాల్గొనే అవకాశం దక్కిందని, క్రికెట్, బాస్కెట్ బాల్ పోటీల్లో వరుస విజయాలు సాధిస్తున్నానని కోటేశ్వర్ నాయక్ వివరించాడు. పట్టుదల, కృషితో సాధన చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని కోటేశ్వర్ నాయక్ అంటున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda