నల్గొండలోని మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugodu By Elections) పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు (BSP Chief) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen kumar) వెల్లడించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్రెడ్డికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీఎస్పీ (BSP) గెలుపు చారిత్రక అవసరమన్నారు. సామాజిక న్యాయం అజెండాగా ఉప ఎన్నికల్లోకి వెళ్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
కాగా, మునుగోడు MLA పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీకి పంపారు. ఈ నెల 8వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచాారం శ్రీనివాస్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీమానాను ఆమోదిస్తే ఆరు మాసాల్లోపుగా ఎన్నికలు జరగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దమౌతున్నాయి. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేయనుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు.
దళితబంధుపై ఆశలు..
మరోవైపు మునుగోడుకు బై ఎలక్షన్స్ వస్తుండటంతో దళితుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. హుజూరాబాద్ తరహాలో మునుగోడులోను దళితులందరికీ దళితబంధు ఇస్తారనే గంపడాశతో ఉన్నారు. అయితే వారి ఆశలు నెరవేరుతాయా? లేకుంటే కొందరికే ఇస్తారా? అనేదానిపై మాత్రం సందిగ్ధం నెలకొంది. లబ్ధిదారుల ఎంపికకోసం నియోజకవర్గంలో అధికారులు వేగం పెంచారు. అర్హులను గుర్తించి నివేదిక తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నాంపల్లి, నారాయణపురం మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తైనట్లు సమాచారం.
గత నెల 3న మునుగోడు మండలం జమస్థాన్ పల్లిలో 39 మందికి, నారాయణపురం మండలం గుడిమల్కాపురంలో 26 మందికి, చిమిర్యాలలో 35 మందికి దళితబంధు యూనిట్లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. అయితే గత ఏడాది బడ్జెట్ లో కేటాయించిన కోటా పూర్తి అయింది. కానీ ఈ బడ్జెట్లో 2 లక్షల మందికి యూనిట్లు ఇస్తామని ప్రకటించడంతోపాటు అందుకోసం 17,700కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పూర్తి కాలేదు. అంతేకాదు ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే అందుకు భిన్నంగా మునుగోడు బై ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నాంపల్లి, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తైనట్లు సమాచారం. మునుగోడు, మర్రిగూడ, చండూరు, చౌటుప్పల్ మండలాల్లో ఎంపిక పూర్తి కావల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bsp, Dalitha Bandhu, Elections, Nalgonda, Rs praveen kumar