సాధారణంగా మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. బడి, ఆస్పత్రి, తాగు నీరు వంటి మౌలిక సదుపాయలు ఉండవు. ఇక దట్టమైన అడవుల్లో ఉండే ప్రాంతాల్లో కనీసం కరెంట్ కూడా ఉండదు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. మారుమూల పల్లెలు,తండాలు, చెంచుపెంటలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడమతో.. సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ.. రెడ్కో ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ లో కలిసి మొత్తం 325 గుడిసెలకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలో మొత్తం 216 సోలార్ విద్యుత్ వ్యవస్థలు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో మొత్తం 109 సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అనేక చెంచు పెంటలున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అక్కడ మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి. రోడ్లు వేయాలన్నా.. ఇతర పనులు చేయాలన్నా అటవీ అనుమతులు లభించవు. విద్యుత్ లైన్లు వేసే పరిస్థితి కూడా లేదు. వందల ఏళ్లుగా వారి కుటుంబాలు అటవీ ప్రాంతంలోనే జీవిస్తున్నాయి. వారు కూడా అడవితల్లిని వదిలి మైదాన ప్రాంతానికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అయితే అటవీ అనుమతులు, ఇతర ఇబ్బందుల పేరుతో రాష్ట్ర సర్కారు వారి సంక్షేమాన్ని పక్కన పెట్టేయలేదు. వారికోసం సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపింది. అడవుల్లో జంతువుల భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్న వారికి భరోసా కల్పించింది.
Hyderabad: నగరవాసులకు బిగ్ అలర్ట్.. మరో 10 రోజుల పాటు ట్రాఫిక్ సమస్యలు..!
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కొల్లంపెంట, కొమ్మనపెంట అనే గ్రామాలు ఉంటాయి. ఈ రెండు గ్రామాల్లో మొత్తం 39 గుడిసెలకు రెడ్కో సంస్థ సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించింది. చెంచుపెంటల్లోని ఒక్కో ఇంటిలో 300WP సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒక్కో ఇంటికి మూడు ఎల్ఈడీ బల్బులు, అలాగే ఒక BLDC సీలింగ్ ఫ్యాన్ ఉచితంగా ఏర్పాటు చేసింది. ఎంతో వ్యయ, ప్రయాసల కోర్చి.. ఈ పనులు చేపట్టింది. లైట్లు, ఫ్యాన్ల మెయింటనెన్స్ ఐదేళ్ల వరకు సదరు కాంట్రాక్టు సంస్థే చూసుకుంటుంది. లైట్లు పాడైతే వాటి స్థానంలో కొత్త లైట్లు ఏర్పాటు చేస్తారు. చెంచుపెంటల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ వ్యవస్థను రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి పరిశీలించారు. కష్టతరమైనప్పటికీ.. దారి కూడా సరిగాలేని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లారు. చెంచు పెంటలకు చేరుకుని గుడిసె గుడిసెకి తిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన.. సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి.. సోలార్ లైట్లు, BLDC ఫ్యాన్ల పనితీరు గురించి తెలుసుకున్నారు.
సోలార్ వ్యవస్థ ఏర్పాటుతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని స్థానికులు చెప్పారు. ఏడాది క్రితం వరకు కిరోసిన్ దీపాల వెలుగులో బతికామని... లైట్లు లేకపోవడంతో విషపురుగులు, అటవి జంతువులు దాడి చేసేవని అన్నారు. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డామని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన మరికొన్ని గుడిసెలకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని చెంచులు సతీష్ రెడ్డిని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన.. గుడిసెలకు లైట్లతో పాటు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రెడ్కో జిల్లా మేనేజర్ సత్యనారాయణ మూర్తికి ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లు నడిచేందుకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి చెప్పారు సతీష్ రెడ్డి. ఈ సందర్భంగా తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమికి రైతుబంధు వస్తోందని చెంచులు సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు కూడా అందుతోందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Nallamala, Telangana