రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
తమ తోటి ఉద్యోగి విధి నిర్వహణలో మరణించడంతో ఉద్యోగులంతా ఏకమయ్యారు. తమ తోటి సిబ్బంది కుటుంబాన్ని ఆదుకోవాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీంతో జాతీయ రహదారి 44పై దాదాపుగా గంటపాటు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతా ఒక్కసారిగా స్తంభించింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని 44వ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్ ప్లాజాలో పనిచేస్తున్న సయ్యద్ మియా (58) డ్యూటీలో ఉండగా గుండెపోటుతో చనిపోయాడు.
ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అతనితో పాటు పని చేసిన ఉద్యోగులు పార్టీల, కార్మికుల సంఘాల నాయకులు టోల్ ప్లాజా వద్ద మృతదేహంతో ధర్నా చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన సయ్యద్ మియా టోల్ ప్లాజాలో గార్డుగా 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సిద్ధిబి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
మంగళవారం ఉదయం డ్యూటీ చేస్తున్న సయ్యద్ గుండెపోటుతో కుప్పకూలారు. ఉద్యోగులు కర్నూల్ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. గతంలో కొంతమంది సిబ్బంది చనిపోతే టోల్ యాజమాన్యం పట్టించుకోలేదని న్యాయం చేయాలంటూ టిఆర్ఎస్ సీఐటీయూ, సిపిఐ నాయకులతో ఉద్యోగుల టోల్ ప్లాజా ముందు ధర్నా చేశారు. దీంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి, తనకు న్యాయం జరగకపోతే టోల్ వసూలు కూడా నిలిపివేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సంస్థ నుంచి వచ్చే బెనిఫిట్స్ తో పాటు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
అయితే గతంలో చాలామంది ఉద్యోగులు అనారోగ్యాల బారిన పడినా కానీ వివిధ కారణాలవల్ల సెలవుల్లో ఉన్నా కానీ వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ అందకపోవడం వల్ల నష్టపోయారనిమరణించినా కానీ యాజమాన్యం పట్టించుకోవడంలేదనే ఉద్దేశంతోనే తాము ధర్నాకు దిగామని టోల్ ప్లాజా ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులు సమయానికి మించి పనిచేస్తున్నా, కష్టపడుతున్నా గాని సంస్థ నుంచి ఎలాంటి గుర్తింపులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి 14 గంటల వరకు డ్యూటీ చేయాల్సి వస్తుందని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana