Naveen Kumar, News18, Nagarkurnool
ప్రపంచంలోనే అతి పెద్ద అడవుల్లో ఒకటిగా పేరుగాంచింది నల్లమల అభయారణ్యం (Nallamala Forest). తెలంగాణ (Telangana) లోని నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో విస్తరించి ఉన్న నల్లమల అటవీప్రాంతంలో అపూర్వమైన అటవీ సంపదతో పాటు ఎంతో విలువైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వందల సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతంలో నిర్మించిన కట్టడాలు చాలా వరకు వెలుగులోకి రాలేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్నప్పటికి ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో ఈ చారిత్రక కట్టడాలు అటవీప్రాంతంలోనే మగ్గిపోయి కాలగర్భంలో కలిసి పోతున్నాయి. అలా మరుగున పడిన ఒక చారిత్రాత్మక కట్టడమే నవనారసింహ స్వామి ఆలయం. నల్లమల అభయారణ్యంలో ఉన్న ఈ ఆలయంపై న్యూస్18 ప్రత్యేక కథనం.
ఆలయం విశిష్టత
నాగర్కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలం లక్ష్మాపురం గ్రామ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ నవ నారసింహ ఆలయం ఉంది. గ్రామానికి పశ్చిమంగా ఉన్న కొండపై అప్పటి రాజులూ ఈ ఆలయాన్ని నిర్మించారు. కొండను తొలచి చిన్న చిన్న గుహలుగా నిర్మాణం చేసి ఒక్కో గుహలో ఒక్కో నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నరసింహ స్వామి కొలువై ఉన్నందుకు ఈ కొండను నరసింహ కొండయని, ఈ కొండను ఆనుకొని ప్రవహిస్తున్న వాగును నరసింహ వాగని పిలుస్తుంటారు.
కర్నూలు జిల్లా (Kurnool District) లోని అహోబిల ఆలయాన్ని పోలి ఉండటంతో ఈ క్షేత్రాన్ని మరో నల్లమల అహోబిలంగా ఆ ప్రాంత వాసులు పిలుస్తున్నారు. ఇక్కడ నరసింహ స్వామి తొమ్మిది అవతారాల్లో కొలువై ఉన్నాడు. వీటిలో నృసింహ, వరాహ, బాల, వృద్ధ, ఉగ్ర, యోగ, శాంత, ప్రసన్న, వరద నరసింహ నామాలతో నవనరసింహుడు ప్రతిష్టించబడ్డాడు. కాని ప్రస్తుతం ఇక్కడి ప్రతిమల్లో నృసింహ, వరాహ, వృద్ద, ఉగ్ర, యోగ, అనే ప్రతిష్ఠలు మాత్రమే మనకు దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో హయగ్రీవ, హనుమంత, శివ, మహిషాసుర మర్థిని, బైరవ, గణపతి ప్రతిష్ఠలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్ని కూడా కొండ గుహల్లో కొలువై ఉండడం గమనార్హం.
ఆలయ గర్బగుడిలో ఉన్న నృసింహ మూర్తి అవతారినికి ఎదురుగా ఉన్న గదిలో వరాహమూర్తి ఎదురెదురుగా పద్మాసీనులై ఉన్నారు. స్వామి వారికి ఎడుమ వైపున వేరు వేరు గదుల్లో ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి అనే దేవతా మూర్తులు ఉన్నారు. చెంచు లక్ష్మి చేతిలో విల్లంబులు ధరించి ఉంటుంది. ఈ దేవతల పేరు మీదుగానే ఆ గ్రామానికి లక్ష్మిపురంగా పేరుగాంచి లక్ష్మాపురం గ్రామంగా వాడుకలోకి వచ్చింది. ప్రధాన ఆలయానికి కుడివైపున గల కింద మార్గంలో మహిషాసుర మర్ధిని దేవత ఉంది. ఆమె వాహనం సింహం కావడం విశేషం. కొండ పైబాగంలో క్షేత్ర పాలకుడిగా భైరవుని విగ్రహం వ్రీడాకటీరుడిగా ఉంటుంది.
ఈ భైరవుడి విగ్రహం తప్ప ఈ క్షేత్రంలో అన్ని విగ్రహాలు కృష్ణ శిలను ఉపయోగించి నిర్మాణం చేయబడినవి. అన్ని విగ్రహాలు పిండ స్పూర్తితో జీవకలలు ఉట్టిపడుతూ ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి శాసనాలు ఆధాలు కూడా లేవు. మహిషాసుర మర్దిని ఆలయం ముఖ ద్వారంపై మాత్రమే త్రైలోకాధిత్య, ధర్మదితి అని రెండు వాఖ్యాలు మాత్రం సంస్కృత బాషలో లిఖించి ఉన్నాయి. వీటి అర్థం దర్మోదిత లేదా ధర్మాధిత్యా అని ఉండవచ్చునని ప్రముఖ నవల రచయిత, చరిత్రకారులు శ్రీ కపిలవాయి లింగమూర్తి తాను రచించిన భగవతత్వం అనే గ్రంథంలో వివరించే ప్రయత్నం చేశారు.
ఘన చరిత్రను వెతికి తీయాల్సిన అవసరముంది
చారిత్రాత్మక కట్టడాలను, సంపదను సంరక్షిస్తున్న ప్రభుత్వం నవనారసింహ ఆలయం చరిత్రను వెతికితీయాల్సిన అవసరముందని గ్రామస్థులు కోరుతున్నారు. నరసింహ స్వామికి చెందిన తొమ్మిది విగ్రహాలు ఒకే చోట కొలువుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధిచిన చరిత్ర, ఆనవాలు ఇప్పటి వరకు స్పష్టంగా ఎక్కడా లేవు. ఈ చరిత్రపై పరిశోధనలు జరిపితే నల్లమల ప్రాంత ఘనత వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఏకదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తుండగా, మిగతా రోజుల్లో ఆలయంలో ఎలాంటి పూజలు, కైంకర్యాలు నిర్వహించడం లేదు.
ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి
లక్ష్మాపురం గ్రామ శివారులో కొలువైన ఈ నవనారసింహ ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌఖర్యం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు శ్రీశైలం ప్రధాన రహదారి ద్వారా మున్ననూరు అటవీ చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకోవాలి. అక్కడి నుంచి అమ్రబాద్ మండల కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి 10 కిలో మీటర్లు ప్రయాణించి లక్ష్మాపురం గ్రామానికి చేరుకోచ్చు. లక్ష్మాపురం గ్రామం దాటిన తరువాత నరసింహవాగును ఆనుకొని నరసింహ గుట్టకి కాలినడకన చేరుకోవాలి. ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఒంటరిగా వెళ్లడం ఎంతో ప్రమాదమని స్థానికులు చెబుతున్నారు. వన్యమృగాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. లక్ష్మాపురం గ్రామస్థుల సహకారంతో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Hindu Temples, Local News, Nallamala, Telangana