(N.Naveen Kumar,News18,Nagarkurnool)
తెలంగాణలో భారీగా పెరుతున్నఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం
ప్రత్యామ్న్యాయ పంటలవైపు మొగ్గు చూపుతున్న రైతులు
అధిక లాభాల కోసం వాణిజ్య పంటల సాగు
నాగర్కర్నూల్ జిల్లాలో 516 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
రైతులకు మొక్కలు అందించి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
జిల్లాలో 1,90,000 మొక్కల పెంపకానికి ఆయిల్ పామ్ నర్సరీల ఏర్పాటు
తెలంగాణ(Telangana)ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్(Oil palm)పంటల సాగు పెరుగుతుంది. రైతులను ప్రోత్సహిస్తూ సబ్సిడీ (Subsidy)ద్వారా ఆయిల్ పామ్ పంటను సాగుచేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈఏడాది ప్రతి జిల్లాలో 3 వేల ఎకరాల్లో పంట సాగయ్యేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని రైతులతో సాగు చేయిస్తున్నారు. ఇందులో బాగంగానే నాగర్కర్నూల్(Nagarkurnool)జిల్లాలో ఇప్పటికే 516 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలను సాగు చేశారు. అయితే రైతులకు ఈ ఆయిల్ పామ్ మొక్కలను పంపిణీ చేసేందుకు ఉద్యానవనశాఖ(Horticulture Department)ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆయిల్ పామ్ నర్సరీల(Nurseries)ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ సహకారం:
సాంప్రదాయ పంటలన వరి, పత్తి, వేరుశనగ పంట స్థానంలో అధిక లాభాలు గడించేలా తోటలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో బాగంగానే ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండటంతో సబ్సిడీ ద్వారా మొక్కలను దిగుమతిచేసుకొని పంటలను సాగు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో సాగుచేస్తున్న ఈ పంటకు ఆయిల్ పామ్ మొక్కలను అందించేందుకు ప్రభుత్వం 'ప్రీయూనిక్' కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఒక్కో నర్సరీ ద్వారా ఏడాదికి 1,90,000 మొక్కలను అందించేందుకు ఏర్పాట్లను చేపట్టారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్ జిల్లాలో ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలో పాలెం గ్రామానికి సమీపంలో ఈ నర్సరీని ఏర్పాటు చేశారు. 12 నెలల పాటు ఇక్కడ మొక్కలను పెంచి రైతులకు పంపిణీ చేయనున్నారు.
ఆయిల్ పామ్ మొక్కల నర్సరీ:
ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు టార్గెట్ విధించి పంటలను సాగు చేసేలా చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాలకు సరిపడా మొక్కలను అందించేందుకు స్థానికంగానే ఆయిల్ పామ్ మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ విత్తనాలను మలేషియా నుంచి దిగుమతి చేసుకొని మొదటగా ప్రత్యేక ట్రేలలో ఈ విత్తనాలను నాటుతారు. ఇందుకోసం షేడ్ నెట్ నర్సరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఒక బ్యాచ్లో 1,90,000 మొక్కల పెంపకాన్ని చేపడుతారు. కోకో పీట్, వర్మి కంపోస్ట్, వ్యామ్ ప్రోటరీల మిశ్రమాన్ని వేసి 3 నెలల పాటు మొక్కలను షేడ్ నెట్ నర్సరీలో ఉంచి ప్రతి మొక్కకు 3 నుంచి 4 ఆకులు వచ్చే వరకు పెంచుతారు. అనంతరం ఓపెన్ నర్సరీకి మొక్కలను బదిలీ చేసి పెంపకాన్ని చేపడుతారు. 30/45 అంగుళాలు 600 గేజ్ గల బ్యాగ్లో ఉంచి ఓపెన్ నర్సరీలో మొక్కల పెంపకం చేపడుతారు. మొక్కలపెంపకంలో బయోఫెర్టీలేజర్స్తో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కేవలం సేంద్రీయ పద్దతిలోనే పెంచుతారు. 20 కిలోల సంచిలో మొక్కను ఉంచి 3 నుంచి 4 అడుగులు ఎదిగే వరకు పెంపకం జరుగుతుంది. ఇలా 12 నెలల పాటు మొక్కలను పెంచిన అనంతరం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తారు.
3-4 ఏళ్లలో ఆయిల్ పామ్ పంట చేతికి:
నర్సరీలో ఒక బ్యాచ్లో పెంపకం చేపట్టిన 1,90,000 ఆయిల్ పామ్ మొక్కలతో 3,400 ఎకరాల్లో సాగు చేపట్టవచ్చని నర్సరీ అధికారులు వెల్లడించారు. ఏడాది మొక్కలను నాటిన రైతులకు 3 ఏళ్లలో ఆయిల్ పామ్ పంట చేతికి వస్తుంది. మొదటి క్రాప్లో ఎకరానికి 50 నుంచి 57 చెట్లను సాగు చేయవచ్చు. ఒక్కో ఎకరా నుంచి 4 నుంచి 5 టన్నుల వరకు పంట చేతికి వస్తుంది. 8 ఏళ్ల అనంతరం 10 నుంచి 12 టన్నలు వరకు పంట చేతికి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ఆయిల్ పామ్ ధర రూ.23000 వరకు మద్దతు ధర లభిస్తుంది. పంటలు చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వం స్థానికంగానే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేపడుతుందని అధికారులు వెల్లడించారు.
ఆయిల్ పామ్లో అంతర పంటల సాగు:
ఆయిల్ పామ్ మొక్కలను నాటిన అనంతరం 3 ఏళ్ల వరకు తోటలో అంతర పంటలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో మొక్క మధ్య 4 నుంచి 5 అడుగుల దూరం ఉంటుందని, దీంతో అంతరపంటలను సాగు చేసుకునేందుకు ఇబ్బంది ఉండబోదని అధికారులు అంటున్నారు. పప్పుదినుసులు, వేరుశనగ, చిరు దాన్యాలు వంటి పంటలను సాగు చేసుకొవచ్చు. 4 ఏళ్ల అనంతరం మొక్కల పెరుగుదలను బట్టి వాటి నీడ అంతరపంటలపై పడకుండా సాగుచేసుకొనే అవకాశం ఉంది.
నాగర్కర్నూల్ జిల్లాలో 516 ఎకరాల్లో సాగు:
నాగర్కర్నూల్ జిల్లాలో 2022 ఏడాదికి గానూ 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకి సంబందించి నర్సరీలో మొక్కల పెంపకం కొరకు టార్గెట్ విధించింది ప్రభుత్వం. \"ప్రస్తుతం జిల్లాలో 516 ఎకరాల్లో సాగును చేపట్టాము. డిసెంబర్ నాటికి 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలను సాగుచేస్తాము. రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందిస్తున్నాం. మొక్కల కొరత ఏర్పడకుండా జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రీయూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేశాము. ఇక్కడ పెరిగిన ఏడాది మొక్కలను రైతులకు అందిస్తాము\" అని జిల్లా హర్టీకల్చర్ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై మరిన్ని విషయాల కోసం హర్టీకల్చర్ అధికారిని సంప్రదించవచ్చు. ఫోన్:8639031915
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool