Naveen Kumar, News18, Nagarkurnool
పేదల కోసం ఇళ్ల స్థలాల గుర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా యంత్రాంగం జిల్లాలో గల ప్రభుత్వ భూములను గుర్తించడం మొదలుపెట్టింది. ఇల్లు లేని పేదలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరితగతిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కలెక్టర్ ఉదయ్ కుమార్ ఇతర ఉన్నత అధికారులతో కలిసి ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కొల్లాపూర్ నియోజక వర్గంలోని సింగోటం, పెంట్లవెల్లి వంటి గ్రామాల దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములను గుర్తించారు. త్వరలోనే ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో నిరుపేదల అవాసాలకు ఉద్దేశించి కేటాయించిన ప్రభుత్వ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్అధికారులను ఆదేశించారు.
పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ మండలంలోని సింగోటం, పెంట్లవెల్లిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి గతంలో సేకరించిన ప్రభుత్వ భూములను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ.. గతంలో ఎస్సీ, ఎస్టీలు, బిసిలకు ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు దాదాపు అన్ని మండలాల్లో ప్రభుత్వ భూమిని సేకరించారు. అయితే, వివిధ కారణాల వల్ల ప్రభుత్వం స్థలం కేటాయించినా అక్కడ ఇళ్లు నిర్మించుకోకపోవడం, మరికొన్నింటికికేటాయింపులే చేయకుండా ఉండిపోయాయని తెలిపారు.
అలాంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించి తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు ఇతరులు ఆక్రమించుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తహసిల్దార్ ల పై ఉందని తెలియజేసారు. వీటితోపాటు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా అందించేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ ఉదయ్ ప్రకటన ద్వారా తెలిపారు. దారిద్ర రేఖకు దిగువనున్న ఈ ఇండ్లకు ప్రతి ఒక్కరు అర్హులేనని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలనలు చేపట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana