Naveen Kumar, News18, Nagarkurnool
నల్లమల అటవీ ప్రాంతం (Nallamala Forest) అటవీ సంపదకే కాకుండా అపారమైన నిధి నిక్షేపాలకు క్షేత్రమని చెబుతూ ఉంటారు. కాకతీయ రాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో అనేక శివాలయాలను, ఇతర ఆలయాలను నిర్మించినట్లు చారిత్రక ఆనవాలు ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాలు నిర్మాణం చేపడుతున్న క్రమంలో పరిసర ప్రాంతాల్లో నిధులను నిక్షిప్తదేసి ఆలయ కట్టడాలు చేపట్టారని కథలుగా చెప్పుకుంటారు. వీటిలో వాస్తవ అవాస్తవాలు ఎలా ఉన్నా.. కొందరు వ్యక్తులు మాత్రం గుప్త నిధులను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల్లో చాలావరకు పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా విగ్రహాలు ద్వంసం కావడం, ఆలయ గోడలు, పునాదులు దెబ్బతిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్ మండలాల్లోని అడవుల్లో నిత్యం గుప్త నిధుల తవ్వకాలు జరుగుతుండడం కలకలం రేగుతుంది. ఇటీవల అమ్రాబాద్ మండలంలోని ప్రతాప రుద్రుని కోట సరిహద్దుల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. శ్రీశైలం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రతాపరెడ్డి కోట వద్ద ఐదుగురు వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నించారు. ఈ కోటకు వెళ్లే మార్గంలో అటవీశాఖ అధికారులు గేటును సైతం ఏర్పాటు చేశారు. అనుమతి లేనిదే ఈ మార్గం నుంచి లోనికి ప్రవేశించకూడదని నిబంధనలు విధించారు.
అయినా పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి రెండు బైకులపై వెళ్లి తవ్వకాలు జరిపేందుకు యత్నించారు దుండగులు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అమ్రాబాద్ మండలంకు చెందిన రామచంద్రయ్యతో పాటు వంగరోనిపల్లికి చెందిన రామాంజనేయులు, దేవరకొండకు చెందిన చంద్రయ్య, బూత్పూర్కు చెందిన కృష్ణయ్య, మహబూబ్నగర్కు చెందిన చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఇక నల్లమల ఆటవీ ప్రాంతంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా, అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వలన తరచూ గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఉన్న ఉమామహేశ్వరం, మద్దిమడుగు, మల్లెలతీర్థం, లొద్ది మల్లయ్య, అస్సాపూర్, బౌరపురం వద్ద బ్రమరాంబ అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి. ఈ ఆలయంతో పాటు నల్లమలలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో కూడా గతంలో తవ్వకాలు జరిగినట్టుగా తెలుస్తుంది.
అధికారులు అందించిన లెక్కల ప్రకారం 2018 నుంచి నమోదు చేసిన వివరాలు.. 2018 ఆగస్టు 10న రాయల గండి వద్ద ఆలయ సమీపంలో గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్న పలువురిని స్థానికులు పట్టుకున్నారు. 2019 నవంబర్ 20న పదర మండలంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 2020 ఫిబ్రవరిలో 11న అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ పరిధిలోని బౌరపురం భ్రమరాంబిక ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. 2021 అక్టోబర్లో లక్ష్మీ చెన్నకేశవుల ఆలయంలో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఇలా ప్రతి ఏడాది నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
అలాగే గత ఏడాది అమ్రాబాద్ మండలంలోని రాయల గడిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చోటుచేసుకున్నాయి. అమ్రాబాద్, పదర ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణం భాగంలో ఉన్న పురాతన రాతి శిలను డ్రిల్లింగ్ చేసి శిల్పంలోని పద్మన్ని ఎత్తుకెళ్లారు. రెండేళ్ల కిందట ఇదే ఆలయంలో తవ్వకాలకు ప్రయత్నించారు. పారిపోతున్న దుండగులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ పోలీసులు అటవీశాఖ అధికారులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారని ప్రజల నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana