రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
అఖండ దీపం వెలిగే ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలయమే వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో కొలువై ఉంది. దాదాపుగా 250 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయంలో వీరంజనేయ స్వామి వారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో దాదాపుగా 237 ఏళ్ల నుంచి అఖండ దీపం నిర్విరామంగా వెలుగుతూనే ఉంది.
ఈ దీపాన్ని చూసి దర్శించుకునేందుకు ప్రత్యేక పర్వదినాల్లో జిల్లా వ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు తరలివస్తూ ఉంటారు. గోపాలపేట మండలం మున్నూరులో వీరంజనేయస్వామి ఆలయంలో ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉంది.ఈ గ్రామంలోని అర్చక కుటుంబీకులు ఐదు తరాలుగా స్వామివారికి సేవలు చేస్తూ అఖండ జ్యోతిని కాపాడుకుంటూ వస్తున్నారు.
ఆలయ పూజారులు, గ్రామస్తులు తెలిపిన చరిత్ర ప్రకారం మున్ననూరు గ్రామంలో మునీశ్వరుల గుట్ట ఉంది. ఇక్కడ మునులు తపస్సు చేసే వారిని మునులు సంచరిస్తున్నందుకు ఈ ఊరికి మునుల ఉరుగా పేరు వచ్చిందని గ్రామస్తులు చెప్పారు. కాలక్రమేణా మున్ననూరుగా మారింది. కాగా 237ఏళ్ల క్రితం ఆంధ్ర పాలకులు, బొబ్బిలి వంశానికి చెందిన రాజులు శత్రువులపై యుద్ధానికివెళ్లే సమయంలో గోపాల్పేట సంస్థానం మద్దతు కూడగట్టుకుంటూ ఇక్కడ రాణి రంగనాయకమ్మతో ఓ సంధి చేసుకున్నారు.
యుద్ధానికి వెళ్లే దారిలో ఉన్న మున్ననూరులో ఏకశిలా విగ్రహ రూపంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఓరోజు రాత్రి బస చేశారు. యుద్ధంలో గెలిస్తే చీకటిగా ఉన్న ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తామని వారు మొక్కుకున్నారు. ఆ యుద్ధంలో శత్రువులపై గెలిచిన బొబ్బిలి వంశీయులు తిరుగు ప్రయాణంలో ఆలయంలో ఆముదం నూనెతో అఖండ జ్యోతిని వెలిగించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.
ఆ తర్వాత సుదూర ప్రాంతాల నుంచి అఖండ జ్యోతి వెలిగించడానికి తైలం ఒత్తులను పంపేందుకు ఇబ్బంది కావడంతో గోపాల్పేట సంస్థానం రాణి రంగనాయకమ్మకు తైలం పంపించాలని అందుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని బొబ్బిలి రాజుల వంశస్థులు వర్ధమానం పంపారు. అప్పటినుంచి దీపానికి కావలసిన నూనెను రాణి పంపిస్తూ ఉండేవారు. ఆ తరువాత కాలంలో గోపాల్పేటలో సంస్థానాదీశులు స్వయంగా అఖండ జ్యోతి ఆలయ అర్చకులు ఆయన పాలన చూసుకుంటున్నారు.
రాజరిక పాలన అంతరించిన తర్వాత కూడా గ్రామంలో పెద్దలు విరాళాలు సేకరించి ఆ డబ్బులతో తైలం అందించి దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆలయంలో వెలిగించే దీపం కోసం రూ. 65 వేల విరాళాలను సేకరించి ఉంచారు.
ఈ ఆలయంలో బొబ్బిలి వంశం రాజు వెలిగించిన అఖండ జ్యోతిని మున్ననూరులో అర్చక కుటుంబం ఐదు తరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఐదో తరానికి చెందినవెంకటస్వామి అనే అర్చకుడు ఆలయంలో పూజలు చేయడంతో పాటు అఖండ జ్యోతిని కాపాడుకుంటూ వస్తున్నారు. తన తండ్రి నరసింహులు, తాత వెంకట్రాములతో పాటు ముత్తాతలు కూడా ఆలయంలో పూజలు చేయడంతో అఖండ జ్యోతిని కాపాడినట్లు తమ పూర్వీకులు చెప్పేవారని వెంకటస్వామి చెప్పారు.
ఈ ఆలయంలోరెండు శతాబ్దాలకు పైగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉందనే విషయం 1999 వరకు మున్నూరుతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే తెలిసేది. ఆ తర్వాత పూర్వీకులు నిర్మించిన రాతి మట్టి గోడలు శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో అఖండ జ్యోతి బయట ప్రపంచానికి తెలిసింది.
ప్రతిఏటా శ్రావణమాసం, కార్తీక మాసంతో పాటు హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే గ్రామంలో శుభకార్యాలకు ప్రత్యేక పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో గ్రామస్తులు అఖండ జ్యోతిని దర్శించుకుని వెళ్తారు. శత్రువులపై దండయాత్రలకు ముఖ్యమైన పనులు కోసం వెళ్లే ముందు వనపర్తి సంస్థానాధిషురాలు రాణి జానకమ్మ ఈ ఆలయంలో పూజలు చేసి అఖండ జ్యోతిని దర్శించుకుని వెళ్లేవారని గ్రామ పెద్దలు చెప్తున్నారు. ప్రతిరోజు ఆలయంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి 9 గంటల వరకు భజన చేస్తారు. కపిలవాయి లింగమూర్తి రాసిన పాలమూరు ఆలయాలు పుస్తకంలో మున్ననూరు అఖండ జ్యోతి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలంకలో బుద్దుడి కాలంలో వెలిగించిన అఖండ జ్యోతి ఉందని అలాంటిదే మున్నూరులో ఐదు తరాల వారు రెండు దశాబ్దాలకు పైగా అఖండ జ్యోతిని వెలిగిస్తూ వస్తున్నట్లుగా తెలుపుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana