పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. కొంతమంది వారి పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు. పెళ్లి అనేకాదు ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఆహ్వాన పత్రిక అనేది తప్పనిసరి అయిపోయింది. పెళ్లికి ఇచ్చే ఆహ్వానపత్రిక అయితే శుభలేఖ అని అంటాం. వివాహ తంతులో ఈ శుభలేఖకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. నయా జనరేషన్లో పెళ్లి కార్డు వైరటీగా ఉండాలని అందరూ భావిస్తున్నారు. అలాంటి ఓ శుభలేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందా అనుకుంటున్నారా..? భాషకు, యాసకు పట్టం కట్టి… పెళ్లి కార్డు కొట్టిచ్చిల్లు… లగ్గానికి రాండ్రి అని పిలుపిచ్చిల్లు… అందుకే ఆ పెళ్లి శుభలేఖ వైరల్ అవుతోంది. మొన్నామధ్య పెళ్లి కార్డుతో పాటు భోజనం పంపిచ్చిళ్లు… నిన్న పెళ్లి కారటతో పాటు మందు, మంచింగ్ ఇచ్చిల్లు… కానీ గీ పెళ్లి కార్డుతో ఏమీ పంపలే… కానీ ఆ పెళ్లి కార్డు వైరల్ అయింది.
కారణం.. పెళ్లి శుభలేఖలో వాడిన భాషే. పరాయి సంస్కృతి మోజులో పడి మాతృ భాషను మర్చిపోతున్న వేళలో… మాతృ భాషతో పాటు యాస పదాలతో ముద్రించి శుభలేఖ అందరిని ఆకట్టుకుంటోంది. అందులో ‘‘… వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక’’ వంటి పదాలేం వాడలేదు. అంతా తెలంగాణ వాడుక భాషలోనే ‘‘లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా’’ వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దిన ఈ శుభలేఖ తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది.
ఒల్లదో అనుకునేరు నాదే😜 pic.twitter.com/LmXnkWtaQJ
— chandu_myvillageshow (@chandu_mvs) December 31, 2020
‘మై విలేజ్ షో’లో ఓ ఆర్టిస్ట్ అయిన చంద్రమౌళి (చందు).. వినూత్నంగా తన వివాహానికి ఇలా శుభలేఖను తయారు చేయించుకున్నారు. కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్ నడిపే సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే షార్ట్ ఫిల్ముల్లో చందు నటిస్తుంటారు. అయితే, ఈ శుభలేఖను చందు ట్విటర్లో ఉంచడంతో అది వైరల్గా మారింది. ఎంతో మంది ఈ శుభలేఖను చూసిన వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.