మునుగోడు ఎన్నికల పోలింగ్ (Munugode Bypoll) సమీపిస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీల నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉంటే.. మరోవైపు ఎన్నికల గుర్తుపై రచ్చ జరగుతోంది. రిటర్నింగ్ అధికారి ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి మొదట రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారని.. కానీ టీఆర్ఎస్ ఒత్తిడితో అంతలోనే మళ్లీ వెనక్కి తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తుల జాబితా నుంచి రోడ్డు రోలర్ మాయమవడంపై దుమారం రేగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి (DEO), రిటర్నింగ్ అధికారి (RO).. టీఆర్ఎస్ (TRS) పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తుల వివాదాన్ని ఎన్నికల సంఘాన్ని సీరియస్గా తీసుకుంది.
ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆ తర్వాత అదే రోజు రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కోసం డ్రా నిర్వహించారు. అందులో యుగతలసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తు దక్కింది. కానీ ఆ గుర్తును తొలగించాలని అదే రోజు రాత్రి టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆ రోజు తుది గుర్తుల జాబితాను అధికారులు ప్రకటించలేదు. 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుర్తుల జాబితాను వెల్లడించారు. ఐతే అందులో రోడ్డు రోలర్ గుర్తు మాయమవడంపై దుమారం రేగుతోంది. ఎన్నికల అధికారులు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ ఆరోపిస్తున్నారు. రోడ్డురోలర్ గుర్తునే తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని.. అది సాధ్యంకాక పోవడంతో.. ఎన్నికల అధికారుల ద్వారా రోడ్డు రోలర్ గుర్తును తీసేయించారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. రోడ్డు రోలర్ గుర్తును మొదట పొందిన అభ్యర్థికి తిరిగి కేటాయించాలని బుధవారం ఆదేశించినట్లు సమాచారం. ఐతే అప్పటికే చంచల్గూడలో బ్యాలెట్ ప్రింటింగ్కు నల్లగొండ జిల్లా అధికారులు వెళ్లగా.. వెంటనే దానిని నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. రోడ్డు రోలర్ గుర్తును జతచేసి కొత్తగా ప్రింట్ చేయాలని స్పష్టం చేయాలని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో మనుగోడు రిటర్నింగ్ అధికారిని విధుల నుంచి పక్కకు పెట్టే అవకాశాలు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో అధికారి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సీఈవో కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లా అధికారులకు సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డీఈవో వ్యవహారంపైనా కేంద్రానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని.. ఆయన్ను కూడా తప్పించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana, Trs