Venu, News18, Mulugu
రామప్ప దేవాలయం (Ramappa Temple) పేరు చెప్పగానే తెలియని వారంటూ ఉండరు. బహుశా చూడని వారు కూడా ఉండరు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అనంతరం రామప్ప ప్రఖ్యాతి దేశవిదేశాలకు సైతం వ్యాపించింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన అనంతరం పర్యాటకుల సంఖ్య పెరిగింది. కాగా, ఇక్కడ రామప్ప దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ ప్రాంగణంలో దేవాలయం చరిత్ర విశిష్టతను వివరించడం కోసం టూరిస్ట్ గైడ్స్ అందుబాటులో ఉంటారు. రామప్ప దేవాలయం సందర్శించడానికి వచ్చే వారికి ఆలయం చరిత్ర విశిష్టతను అర్థమయ్యే రీతిలో కళ్ళకు కట్టినట్టు వివరించడంలో గైడ్స్ వెంకటేష్, విజయ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తారు. వీరు రామప్ప ఆలయం చరిత్ర, శిల్ప సౌందర్యం గురించి వివరిస్తూ ఉంటే మనం కాకతీయ కాలంలో రామప్ప శిల్పాలు చెక్కుతుంటే ఆ శిల్పి పక్కనే నిల్చుని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
అంతగా రామప్ప చరిత్రను వివరించే ఈ టూరిస్ట్ గైడ్స్ వెంకటేష్, విజయ్ దాదాపు 16 సంవత్సరాల నుంచి టూరిస్ట్ గైడ్స్ గా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో వీరి జీతం కేవలం రూ.600 రూపాయలు కాగా.. ఇప్పుడు రూ.3900 మాత్రమే అందుతుంది. ఈ రోజుల్లో ఐదు అంకెల జీతం వచ్చినా కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఎందుకంటే నిత్యవసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు నుండి గ్యాస్ సిలిండర్ వరకూ అన్నీ భారీగా పెరిగిపోయాయి. సగటు మనిషి జీవన వ్యయం భారీగా పెరిగినా రామప్ప దేవాలయం వద్ద పనిచేసే గైడ్స్ జీతం మాత్రం రూ.600 నుంచి రూ.3900కు మాత్రమే పెరిగింది.
దీనిపై స్పందించిన ఆ గైడ్స్.. 2004లో రామప్ప టూరిస్ట్ గైడ్స్ గా విధులు నిర్వహించడం ప్రారంభించామని.. అప్పుడు కేవలం రూ.600 జీతంతో మొదలు పెట్టామని.. 2006 నుంచి మా జీతాలు మరి తక్కువగా ఉన్నాయని.. జీతాలు పెంచాలని ఉన్నత అధికారులను కలుస్తూనే ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా యునెస్కో గుర్తింపు లభిస్తుందనే సమయంలో మళ్లీ ఒకసారి మా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా.. రెండు నెలల తరువాత మీ జీతాలు పెంచుతామనే హామీ ఇచ్చారని.. కానీ యునెస్కో గుర్తింపు పొంది రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. మా జీతంలో, జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గైడ్స్ జీతం ఎంత అని అడిగితే వారి బాధ బయటికి కనిపించకుండా చిరునవ్వుతో రూ.3900 రూపాయలని చెప్పుకుంటూ కనిపిస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన అనంతరం రామప్ప దేవాలయానికి భక్తులు, పర్యాటకులు, రాజకీయ నాయకులు, వీవీఐపీల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో రామప్పలో విధులు నిర్వహించే మాకు ఎక్కువ పని భారం ఉంటుందని.. మా జీతాల సమస్య కోసం తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సహా అనేక మందికి విన్నవించుకున్నప్పటికీ తమపైకనికరం కలగడం లేదని చెప్పారు. ఇప్పటికైనా మాకు కనీస వేతనం అందించాలని వేడుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆసరా పెన్షన్ రూ.3000 కాగా.. ఆశా కార్యకర్తకు పదివేల రూపాయల జీతం ఉందని.. మాకు మాత్రం రూ.3900 జీతం వస్తుందని.. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు కనీస వేతనం అందించాలని గైడ్స్ కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Ramappa Temple, Telangana, Warangal