Venu, News18, Mulugu
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మన దేశం అన్ని రంగాలలో దూసుకుపోతూ దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడుతుంది. ఈ మాటలన్నీ చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి కావచ్చు. లోతుల్లోకి వెళ్లి నిజాలను పరిశీలిస్తే 75 సంవత్సరాల భారతదేశంలో సగటు మానవుని పరిస్థితి ఏమిటి అని అడిగితే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ గ్రామానికి మాత్రం ఎనిమిది దశాబ్దాల కాలంగా కనీసం రోడ్డు సౌకర్యం లేదు. స్వాతంత్రం రాక ముందు నుంచే ఆ ప్రాంతం గ్రామంగా కొన్ని కుటుంబాలు ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగించాయి. స్వాతంత్రం వచ్చి ప్రభుత్వం ఏర్పాటైంది.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ ఆ గ్రామం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఫోర్ వే లైన్ రోడ్లు అందుబాటులోకి వచ్చి జాతీయ రహదారులను సైతం కొత్త హంగులతో ఏర్పాటు చేసుకున్న కానీ గిరిజన ప్రాంతాలను మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎనిమిది దశాబ్దాల కాలం నుంచి కనీసం రోడ్డు సౌకర్యం ఇప్పటివరకు కల్పించలేదంటే గిరిజనులపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు రోడ్డు లేదు మరోవైపు ప్రభుత్వం రోడ్డును మంజూరు చేసిన అటవీ అధికారులు మాత్రం ఇంకా మోకాలు అడ్డు పెడుతూనే ఉన్నారు. రాజకీయ నాయకుల హామీలు మాత్రం హామీలుగానే మిగిలిపోతున్నాయి. నాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడైతే జీవనం కొనసాగిస్తున్నారో ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే రోడ్డు మంజూరవుతుందని ఆశపడ్డమని.. అప్పటినుంచి ఇప్పటివరకు దశాబ్దాల కాలం గడుస్తున్నా గ్రామానికి మాత్రం రోడ్డు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం పరిస్థితి ఇంతసేపు మనం మాట్లాడుకుంది. ఈ గ్రామం గురించే ఈ గ్రామం ఏర్పాటు దాదాపు 80 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ కనీసం బీటీ రోడ్డు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది.
కొండపర్తి గ్రామస్తుల కష్టాలను చూడలేక ప్రభుత్వం రోడ్లను మంజూరు చేసినప్పటికీ అటవీ అధికారులు మాత్రం ఈ గిరిజనులపై కనికరం చూపించడం లేదు. రోడ్డు వేయడానికి అనుమతి లేదు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి రోడ్డు వేయడానికి వీలు లేదు అని తెగేసి చెప్తున్నారట.
రోడ్డు మంజూరు చేసేది ప్రభుత్వమే.. రోడ్లు వేయకూడదు అని చెప్పేది ప్రభుత్వమే. మధ్యలో మా బతుకులు నలిగిపోతున్నాయని అక్కడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana