రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లొకేషన్ : ములుగు
భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ భారత్ జోడో యాత్ర కొనసాగింది.
దీనికి కొనసాగింపుగానే ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాత్రలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఇక దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో హాత్ సే హత్ జోడో యాత్ర ములుగు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ములుగు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు సీతక్క రేవంత్ రెడ్డికి హారతి ఇచ్చి, వనదేవతల ప్రత్యేక దర్శనం అనంతరం, ప్రాజెక్ట్ నగర్ అటవీ ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలో అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ యాత్రకు చేరుకున్నారు. భారత్ జూడో యాత్రలో కొండా మురళి, బలరాం నాయక్, దయాకర్, తేజావత్ బేల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే దయాకర్ తో, బేల్లయ్య నాయక్ తో న్యూస్ 18 ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు కొనసాగింపుగానే అన్ని రాష్ట్రాలలో ఈ యాత్ర మొదలవుతుందని.. ఇది కేవలం పాదయాత్ర కాదు ఇది ఒక ఉద్యమం. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలు తుంగలో తొక్కుతుంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రజలతో మమేకం అవ్వడమే ముఖ్య ఉద్దేశంగా ఈ యాత్ర కొనసాగుతుందని దయాకర్ చెప్తున్నారు.
రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఈ యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదని, ఈ యాత్ర దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుందని చెప్తున్నారు. ఆనాడు దివంగత నేతముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల చెల్లమ్మ అంటూ పాదయాత్ర మొదలుపెట్టి అధికారంలోకి రాగా..నేడు ఈ యాత్రతో కేంద్ర స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని అద్దంకి దయాకర్ వ్యక్తం చేస్తున్నారు.
మరో నేత తేజావత్ బేల్లయ్య నాయక్ మాట్లాడుతూ..కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని..ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి.. వారి కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి.. వారి జీవనస్థితిగతులు, వారికి మెరుగైన సౌకర్యాలు ఏ విధంగా అందించాలి. ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారు. ఇలా అనేక అంశాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారని..ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాత్రను కొనసాగిస్తుందని చెప్పారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని లీడర్స్ లలో లుకలుకలు ఉన్నప్పటికీ అవేవీ లెక్కలోకి రావని.. పార్టీ అన్నాక చిన్నచిన్న మనస్పర్ధలు సహజమని..తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీనియర్ నాయకులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana