(M.Venu, News 18, Mulugu)
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినాలు, ఆదివారాలు వచ్చాయంటే చాలు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు వచ్చాయంటే వ్యవసాయ కూలీగా మారుతుంది, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, డబ్బులు కూడబెట్టుకుంటున్న ఈరోజుల్లో ప్రభుత్వం నుంచే వచ్చే జీతంలోని సగానికి పైగా పేద ప్రజలకు, అనాధలకు, నిరాశ్రయులకు ఖర్చు పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్.
వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న తస్లీమాను ప్రలకరించిన న్యూస్ 18 టీం:
ములుగు జిల్లా రామచంద్రపురంకు చెందిన తస్లీమా మహమ్మద్.. పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగింది. తనకు రెండు సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించగా తల్లి అన్ని తానై కుటుంబాన్ని పోషించింది. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించిన తస్లీమా.. తన మూలాలు మర్చిపోకుండా ఇలా వారాంతాల్లో కూలీ పనులు, స్వచ్చంద సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో తెలుసు కాబట్టే వారికి ఏదోవిధంగా సహాయపడాలని నిశ్చయించుకున్నానని తస్లీమా చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు, యువతీయువకులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి తాత్కాలిక సంతోషాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అందుకే వారికి అర్థమయ్యే రీతిలో అప్పుడప్పుడు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నట్లు తస్లీమా వివరించారు.
అనాధలకు అక్కగా తనదైన ముద్ర: ములుగు జిలాల్లో స్వచ్చంద సేవ చేస్తూ అనేకమంది అనాధ పిల్లలకు తోచిన సహాయం చేస్తున్నారు తస్లీమా. అందుకే ఆ పిల్లలు ఆమెను తమ సొంత అక్కగా చెప్పుకుంటుంటారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తమ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొందని.. ఇతరుల్లో ఆ కష్టాలు చూసినపుడు మనసు చలించి వారికి సహాయం చేస్తున్నట్లు ఆమె వివరించారు. ములుగు పరిసర ప్రాంతాలలో తస్లీమా మహమ్మద్ని అధికారిగా పలకరించడం కన్నా, అక్క అని సంబోధించే వారే ఎక్కువమంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు తన మంచితనం వారిలో ఎంతగా నాటుకుపోయిందో.
ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచాలు తీసుకోరు:
లంచాలు తీసుకోనిదే ఏ పని చేయరని ప్రభుత్వ ఉద్యోగులంటే కొందరిలో ఒక చులకన భావం ఏర్పడింది. ఆ వాదన ఎంత మాత్రం నిజం కాదని అంటున్నారు తస్లీమా. ఎవరో కొందరు లంచాలు తీసుకుంటే.. ప్రభుత్వ ఉద్యోగులందరిని తప్పుబట్టడం కరెక్ట్ కాదని, అందరూ ఒకే విధంగా ఉండరని తస్లీమా గట్టిగా చెబుతున్నారు. "నాపై కూడా అనేకమంది అనేక ఆరోపణలు చేసినప్పటికీ, వారికి ఒకటే సమాధానం చెబుతున్నా.. మీరు ఆరోపించినంత మాత్రాన నేను తప్పు చేశానని కాదు. ఒకవేళ తప్పుచేసి ఉంటే దానిని నిరూపించాల్సిన అవసరం ఉంది" అని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అంటున్నారు. "కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి రాజకీయాలకి వస్తున్నారు మీరు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని న్యూస్ 18 ప్రతినిధి అడగ్గా..."ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ నాకు చేతనైన సహాయం చేస్తున్నా, చివరి వరకు ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి సేవ చేస్తా" అని తస్లీమా మహమ్మద్ చెప్పుకొచ్చారు.
Read This; Mulugu: స్వతంత్ర వజ్రోత్సవాలు: ఉప్పొంగిన ఉత్సాహంతో ‘ఫ్రీడమ్ 2కే రన్”
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Local News, Mulugu, Telangana