Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) లో గోదావరి నది (Godavari River) పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు మాత్రం సమృద్ధిగా అందడం లేదు. ములుగు ప్రాంతం నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా అనేక ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించినప్పటికీ ములుగు ప్రాంతానికి మాత్రం అరకొరగానే సాగునీరు అందుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు నియోజకవర్గంలోని సమస్యలపై జల సౌధలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్) మురళీధర్ అధికారినిములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) కలిశారు. తుపాకులగూడెం బ్యారేజి నుండి కాల్వల ద్వారా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లో గల చెరువుల్లో నీరు నింపాలని, గోదావరిపై లిప్టులు ఏర్పాటు చేసి ములుగు నియోజక వర్గానికి సాగు నీరు అందించేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మంగపేట మండలంలోని మల్లూరు దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసి మల్లూరు ప్రాజెక్టులోకి నీటిని మళ్లించాలని, గౌరారం వాగుపై చెక్ డ్యామ్ నిర్మించి చేరుపల్లి పెద్ద చెరువులోకి మళ్ళించడం ద్వారా వేలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. పాఖల చెరువుపై లిఫ్ట్ ఏర్పాటు ద్వారా ఏజెన్సీ మండలాలు అయిన పాఖల, కొత్తగూడ, గంగారంలో గల చెరువులు నింపి రైతులకు సాగు నీరు అందుతుంది. రామప్ప చెరువు నుండి జనగాంకు వెళ్లే దేవాదుల పైప్ లైన్ కు అత్యంత దగ్గర ఉన్న ఇంచెన్ చెరువుకు గోదావరి జలాలకు లిఫ్ట్ చేయాలని కోరినట్లు చెప్పారు.
రామప్ప నుండి పాకాల వరకు దేవాదుల కాల్వ మార్గం మధ్యలో గల ములుగు మండలం పోట్లాపూర్ గ్రామం వరద ఎదళ్ళ చెరువు వద్ద కెనాల్ పై ఆఫ్-టెక్ నిర్మిస్తే 6 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉంటుంది. దేవాదుల పైప్ లైన్ ద్వారా జాకారం, ములుగు లోకం చెరువు, అబ్బాపూర్ చెరువులోకి నీరు అందించవచ్చు. ఈ పై గ్రామల నుండి దేవాదుల పైప్ లైన్ వెళ్ళుతున్నందున ములుగు ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందివ్వాలని సీతక్క కోరారు. రామప్ప చెరువు నుండి రంగాయ చెరువుకు వెళ్లే దేవాదుల కాల్వ ద్వారా కొడిశల కుంట ప్రాంతానికి సాగు నీరు ఇచ్చేందుకు మంజూరైన పనులు కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు. రామప్ప నుండి లక్నవరంకు మంజూరైన దేవాదుల పైప్ లైన్ పనులకు భూసేకరణ త్వరిగతిన పూర్తి చేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.
తుపాకులగూడెం బ్యారేజ్ కి డౌన్ స్ట్రీమ్ కింద ఉన్నటువంటి కన్నాయిగూడెం మండలంలో గ్రౌండ్ వాటర్ సుమారు 600 నుండి 700 ఫీట్స్ వరకు ఉండడం వల్ల పంట పొలాల్లో వేసిన బోర్లు, మోటర్లు పనిచేయడం లేదని.. కావున TSNPDCL ద్వారా ప్రత్యేక జీవో విడుదల చేసి పైపులైన్ ద్వారా కన్నాయిగూడెం మండల రైతుంగానికి నీళ్ళు అందించాల్సిన అవసరం ఉందని.. అంతేకాకుండాములుగు నియోజకవర్గంలో గల అనేక వాగులపై చెక్ డ్యామ్ లు నిర్మించి చిన్న- సన్న కారు రైతాంగానికి సాగు నీరు అందించాలని, లక్నవరం చెరువు, కాలువలకు ఇరువైపుల గైడ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ కోరారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మురళీధర్ త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ములుగు నియోజకవర్గంలోని రైతులకు త్వరలోనే సమృద్ధిగా సాగునీరు అందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, MLA seethakka, Mulugu, Telangana