(M.venu,News18,mulugu)
అతనో మట్టిలో మాణిక్యం. తెలంగాణ(Telangana)లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఓ సాధారణ యువకుడు. మధ్యతరగతి కటుంబం నుంచి వచ్చిన ఆయన వాలీబాల్(Volleyball) క్రీడలో తన నైపుణ్యం, ప్రావిణ్యాన్ని చాటుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ..రాష్ట్రానికి, దేశానికి ఎన్నో పతకాలు సాధించుకొచ్చాడు. అంతే కాదు తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా వాలీబాల్ జట్టు(Women's volleyball team)లోని ప్లేయర్లకు పంచుతున్నారు. ములుగు(Mulugu)జిల్లా చల్వాయి(Chalwai)గ్రామానికి చెందిన కొసరి కృష్ణప్రసాద్(Kosari Krishna prasad)సక్సెస్ స్టోరీ ఇది.
మట్టిలో మాణిక్యం..
ములుగు జిల్లా చల్వాయి గ్రామానికి చెందిన కొసరి కృష్ణ ప్రసాద్ కొద్ది రోజుల క్రితం వరకు వాలీబాల్ ఛాంపియన్ మాత్రమే. కాని ఇప్పుడు భారతదేశ మహిళా వాలీబాల్ జట్టుకు కోచ్గా ఎంపిక చేసింది వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. జులై(4th to 11th)4వ తేది నుంచి 11 వరకు కజకిస్తాన్లో జరిగే 21వ ఏషియన్ అండర్- 20 ఉమెన్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనే మహిళల వాలీబాల్ జట్టుకు కృష్ణప్రసాద్ కోచ్గా వ్యవహరిస్తారు. క్రీడాకారిణులకు తన అమూల్యమైన సలహాలు, సూచనలతో పాటు పతకాలు సాధించేందుకు కావాల్సిన మెళకువలను నేర్పించనున్నారు.
సాధారణ వ్యక్తికి అత్యున్నత స్థానం..
కొసరి కృష్ణ ప్రసాద్ చల్వాయి గ్రామంలోని కొసరి నారాయణస్వామి, రమాదేవి దంపతులకు కలిగిన మూడో సంతానం. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో సోదరులు రాజు ,వేణు ప్రోత్సాహంతో వాలీ బాల్ ఆటలో శిక్షణ పొందాడు. 1996 సంవత్సరంలో వాలీబాల్ స్పోర్ట్స్ హాస్టల్(Volleyball Sports Hostel) వరంగల్లో ప్రవేశం పొంది తన ప్రతిభతో అందర్నీ ఆకర్షించాడు. అక్కడ మొదలైన అతని విజయ ప్రస్థానం..నేషనల్ ఉమెన్ వాలీబాల్ టీమ్ కోచ్గా కొనసాగుతూ వస్తోంది.
గోల్డ్ మెడల్స్ విన్నర్ ..
కృష్ణప్రసాద్ 1996 నుంచి 2019 వరకు తన పతకాల వేట కొనసాగింది. 34 బంగారు పతకాలు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. 2001 నుంచి 2005 వరకు ఆల్ ఇండియా RTC నేషనల్ గేమ్స్ లో ఐదు సాధించాడు. 2005లో స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో DRDO( మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్) ఉద్యోగం సంపాదించాడు. 2005 నుంచి 2019 వరకు DRDO నేషనల్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏకంగా 15 బంగారు పతకాలను సాధించాడు. ఈ విధంగా రికార్డుల పరంపర కొనసాగింది. ఎన్నో పథకాలు, మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణప్రసాద్కి సరైన ఉద్యోగం రాకపోవడంతో మొదట్లో కష్టాలు, అవమానాలను అనుభవించారు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ.
కష్టాలను వెన్నంటే సుఖాలు ఉంటాయనే సూత్రాన్ని బాగా నమ్మిన కృష్ణప్రసాద్ ..2019 లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్-2 కోచ్కు సంబంధించిన కోర్సు కూడా పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో వాలీబాల్ మొదటి తెలంగాణ కోచ్గా ఎన్నికయ్యారు. ఈ కోచ్ ఆధ్వర్యంలో 2015 లో జరిగిన బీచ్ వాలీబాల్ నేషనల్ గేమ్స్ లోతెలంగాణ రాష్ట్ర జట్టు బంగారు పతకం సాధించింది. తాజాగా 2022లో జరిగిన బీచ్ వాలీబాల్ నేషనల్ గేమ్స్ లోనూ తెలంగాణ జట్టు బంగారు పతకం సాధించడంలో ఈ ములుగు జిల్లా బిడ్డ కీలక పాత్ర పోషించారు.
పట్టుదలే అతని సక్సెస్ సీక్రెట్..
ఉద్యోగం లేదని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న కృష్ణప్రసాద్ ఉద్యోగం వచ్చే వరకు సొంత ఇంటికి కూడా రానని భీష్మించుకున్నారు. ఆప్రయత్నంలో భాగంగానే 2005లో స్పోర్ట్స్ కోటాలో DRDO (మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ) ఉద్యోగం సంపాదించాడు. DRDO తరఫున ఆడిన ఎన్నో మ్యాచ్ల్లో పతకాలు సాధించాడు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ.. తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వచ్చారు. కృష్ణప్రసాద్ భార్య స్మిత కూడా నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కావడం మరో విశేషం.
ఆదర్శప్రాయం..
వాలీబాల్ గేమ్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కృష్ణప్రసాద్ 2014 నుంచి తెలంగాణ వాలీబాల్ కోచ్గాను, ఇండియన్ టీం సెలక్షన్ కమిటీ మెంబర్ గాను తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్గా తన విశేష సేవలను అందిస్తున్నారు.రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఓ సాధారణ యువకుడు..క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పొందడం, ఇప్పుడు విమెన్ జట్టుకు కోచ్గా కావడాన్ని జిల్లా యువత ఆదర్శంగా తీసుకుంటున్నారు. చల్వాయి గ్రామంలో చాలా మంది యువకులు వాలీబాల్ క్రీడలో ప్రావీణ్యం సంపాదిస్తూ జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mulugu, Telangana News