Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కానీ పరిస్థితులు మెరుగవుతున్న కొద్దీ ములుగు ప్రాంతం కొద్దికొద్దిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ములుగు ప్రాంతంలోని యువత స్వయం ఉపాధిపై ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఎలాంటి రంగాన్ని ఎంచుకోవాలి.. ఎలా ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి చూపించాలి.. ఇలా పెట్టుబడి విషయంలో ఆర్థిక సమస్యతో అనేక సందేహాలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారి కోసమే ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ములుగు జిల్లాలోని యువతి యువకులకు పీఎంఈజీపి పథకంపై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు (PMEGP scheme) పిఎంఈజీపి పథకంపై ఈనెల 2న కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు.
కలెక్టరేట్ మీటింగ్ హాల్ ములుగు నందు 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఉన్నత విద్యనభ్యసించి పారిశ్రామిక రంగంలో రాణించాలనే యువతకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (పీఎంఈజీపీ) చేయూతనిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం జిల్లా పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ), ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు (కేవీఐబీ) సంయుక్తంగా అమలుకు పని చేస్తున్నాయి. యువతకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తూ పారిశ్రామిక, సేవా రంగాల్లో బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసి యువతకు తోడ్పాటు అందిస్తోంది.
ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.. తయారీ రంగ పరిశ్రమలకు రూ. 50 లక్షల లోపు, సేవా రంగ రూ.25 లక్షల లోపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు 5 శాతం, జనరల్ అభ్యర్థులు 10 శాతం తొలుత పెట్టుబడి వ్యయంగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో 35% శాతం రాయితీలను అందజేస్తారు.
పీఎంఈజీపీ పథకం ద్వారా రుణాలు..!
వ్యవసాయం, సేవలు, మినరల్ వాటర్, నిర్మాణ రంగ, ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు ఆదరణ బాగుంది. జిల్లాలో అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలు రుణాన్ని 3 నుంచి 7 ఏళ్ల లోపు లబ్ధిదారుడు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా పరిశ్రమల శాఖ, కేవీఐసీ, కేవీఐబీ అధికారులు సంయుక్తంగా పీఎంఈజీపీ పథకంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పీఎంఈజీపి పథకంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సును ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని స్వయం అభివృద్ధి చెందేలా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana