(M. Venu , News 18, Mulugu)
ములుగు (Mulugu) జిల్లాలో భారీ వరదలు (Floods)సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. గోదావరి (Godavari) పరివాహక ప్రాంతాలలో ఉండే గ్రామాలలో గోదావరి నది వరద ప్రవహించింది. ఈ నేపథ్యంలోనే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముంపు బారిన పడిన గ్రామాలను పరిశీలించడానికి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు (CM KCR) ప్రత్యేక కాన్వాయ్లో ఏటూరునాగారం (Eturu nagaram) చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. అనంతరం సీఎం తిరుగు ప్రయాణం మొదలయ్యే సమయంలో సీఎం కాన్వాయ్ వద్ద ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఎలా అయినా ముఖ్యమంత్రిని కలిసి తీరాలని మంకు పట్టు పట్టింది. అక్కడే ఉన్న సీనియర్ నేత కడియం శ్రీహరి మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కాన్వాయ్లోకి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆ మహిళను పిలిపించుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ మహిళ (Woman)పై పడింది. ఆ మహిళ ఎవరు? (Who is she?) ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఆ మహిళ మాజీ దళ సభ్యురాలని (Former Maoist), ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువ పల్లి గ్రామానికి చెందిన పుర్రి స్వరూప (Swaroopa) అలియాస్ సంధ్యగా (Sandhya) గుర్తించారు. అతి చిన్న వయసులోనే విప్లవానికి ఆకర్శితురాలై, పదేళ్ల వయసులోనే దళంలో చేరేందుకు వెళ్ళింది పుర్రి స్వరూప. ఈ వివరాల ఆధారంగా న్యూస్ 18 కాలోపల్లి గ్రామానికి చేరుకొని ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. పుర్రి స్వరూప చిన్నతనంలోనే పట్టుమని పది సంవత్సరాల వయసులోనే విప్లవాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ బాట పట్టింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత జననాట్యమండలి ఆధ్వర్యంలో అనేక విప్లవ గేయాలను పాడుతూ మావోయిస్టులతో పాటు గిరిజన గ్రామాల్లో పర్యటించి విప్లవ గేయాలు పాడింది.
అడవిలో అనేక కష్టాలను ఎదుర్కొని..
స్వరూప కుటుంబం పేదరికంలో అనేక కష్టాలు ఎదుర్కొంది. తన చిన్నతనంలోనే విప్లవాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు స్వరూప తనకు తెలియకుండానే తల్లిదండ్రులను దూరం చేసుకుంది. అడవిలో అనేక కష్టాలను ఎదుర్కొని అనారోగ్య బాధలతో జనంలోకి వచ్చిన స్వరూప.. అమ్మానాన్నలతో సంతోషంగా జీవించాలనుకుంది. ఉద్యమ బాట నుంచి జనజీవన స్రవంతిలో కలిసే సమయానికి స్వరూప తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఒంటరిగా మిగిలి దుఃఖంలో మునిగిపోయింది.
"నేను దళంలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం కూడా ఉవ్వెత్తున సాగుతుంది. నేను విప్లవ పాటలతో పాటు తెలంగాణ ఉద్యమ పాటలు కూడా పాడేదాన్ని. నేను లొంగిపోయే సమయంలో 2009లో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉండగా అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ ప్రజలకు దగ్గరయ్యాను. కేసీఆర్ అంటే అభిమానంతో తెలంగాణ వచ్చిన అనంతరం టిఆర్ఎస్ (TRS) పార్టీ కోసం పనిచేస్తున్నట్లు" స్వరూప పేర్కొంది.
జనజీవన స్రవంతిలో కలుస్తూ, లొంగిపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయము ఇప్పటివరకు అందలేదని.. మూడెకరాల భూమి ఇస్తామన్న అధికారులు ఇప్పటివరకు స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఏటూరునాగారంలో ముఖ్యమంత్రిని కలిసే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించదలిచినట్లు స్వరూప చెప్పుకొచ్చింది. పదవుల కోసమో, భూమి కోసమో.. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసమో ముఖ్యమంత్రిని కలవలేదని, కేవలం ఆయనపై అభిమానంతో మాత్రమే కలిశానని పుర్రి స్వరూప న్యూస్ 18తో చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Warangal, WOMAN