(Venu Medipelly,News18,mulugu)
ఉమ్మడి వరంగల్(Warangal)సహా హైదరాబాద్(Hyderabad),బీదర్(Bidar)వంటి ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్రవాహనా(Two-wheelers)లే టార్గెట్ గా చోరీకి పాల్పడుతున్న ముఠాను హనుమకొండ(Hanumakonda)పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి(Tarun Joshi)శనివారం మీడియాకు తెలిపిన వివరాలు మేరకు...సంగారెడ్డి(Sangareddy)జిల్లా పటాన్చెరుకు(Patancheru)చెందిన షిండే జితేందర్, షిండే అశోక్, హనుమకొండ పద్మాక్షి కాలనీ(Padmakshi Colony)కి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు సోదరులు అవుతారు. జితేందర్ బైక్ మెకానిక్గా పని చేస్తుండగా.. మిగతా ఇద్దరూ కూలి పనులు చేసుకునేవారు.
జల్సాల కోసమే చోరీలు..
జల్సాలకు అలవాటు పడ్డ వీరు తమకు వచ్చే ఆదాయం సరిపోక, సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముకోవాలని ప్రణాళిక వేశారు. ఈక్రమంలో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బైకులను, పటాన్చెరు ప్రాంతంలో నాలుగు బైకులను బీదర్లో ఒక వాహనాన్ని చోరీ చేశారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను హనుమకొండలోని ఈశ్వర్ ఇంటిలో ఉంచారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుండడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
బైక్ దొంగలు చిక్కారు..
సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిందితులపై నిఘా ఉంచారు. ఈక్రమంలో బైక్ చోరీ గురించి ఈ ముగ్గురు నిందితులు హనుమకొండలోని ఈశ్వర్ నివాసంలో ప్రణాళికలు వేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో ఈశ్వర్ నివాసంలో ఉన్న ఎనిమిది వాహనాలను దొంగతనం చేశామని నిందితులు ఒప్పుకున్నారు. దింతో వీరిని అరెస్ట్ చేసి చోరీకి పాల్పడిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ. 13 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
అనుమానాస్పదమృతి..
అనుమానాస్పదస్థితిలో ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన రవి దాస్ అనే వ్యక్తి ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో ఒక ప్రైవేట్ రైస్ మిల్లులో కూలిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి రైస్ మిల్లులోని చెట్టుకు రవి దాస్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఘటనపై సమాచారం అందుకున్న ములుగు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మిల్లులో పనిచేసే వ్యక్తుల మధ్య ఏదైనా ఘర్షణ జరిగి అతనిని చంపి ఉరిగా చిత్రీకరించారా? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu