తెలంగాణ రైతన్నకు శుభవార్త. ఖరీఫ్ పంట వేసే ముందు తియ్యని కబురు అందింది. నేలమ్మ తల్లి తడిపి ముద్దయ్యేలా.. విస్తారంగా వర్షాలు ఉంటాయట. నైరుతి రుతుపవనాలు జూన్ 16 నుంచి 24 లోగా రాష్ట్రానికి చేరతాయని, వానా కాలం అంతా ఆశాజనక వర్షాలు ఉంటాయట. ఖరీఫ్ పంటలకు ఢోకా లేదట. జర్మనీలోని పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ ఇంపాక్ట్ రిసెర్చ్ గ్రూప్ లీడర్ ప్రొఫెసర్ ఎలీనా సురోవ్యాట్కినా వేసిన అంచనా ఇది. జూన్లో వర్షాలు మొదలవుతాయని, జూలైలో కొన్ని రోజులు వర్షాభావ పరిస్థితులు వచ్చి.. ఆ తర్వాత విస్తారంగా వానలు పడతాయని చెప్పారామె. ఫోర్కాస్ట్ ఆఫ్ మాన్సూన్ ఆన్సెట్-2020 సెంట్రల్ ఇండియా, తెలంగాణ అంశంపై వెబినార్ ద్వారా ఆమె మాట్లాడుతూ.. జూలై 15 నుంచి మూడు నెలలపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఎలీనా అన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 854 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్రంలో సాధారణ వర్షాపాతం నమోదవుతుందని.. రైతన్నలకు ఇది శుభ వార్తేనని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ వెబినార్లో జర్మనీ నుంచి ఎలీనాతో పాటు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, డాక్టర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Monsoon rains, WEATHER