MLC Kavitha Phones: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడ్వకేట్ సోమా భరత్ వరుసగా రెండో రోజు ఈడీ ఆఫీస్ కు వచ్చారు. సోమా భరత్ సమక్షంలోనే కవిత ఫోన్లలో డేటాను అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఫోన్లలో ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయనప్పటికీ..అందులో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయనేది ఆసక్తికరంగా మారింది. కాగా కవిత ఈడీకి ఇచ్చిన 10 ఫోన్లలో డేటాను అధికారులు రికవరీ చేస్తున్నారు. అయితే ఇందుకు సాక్షిగా కవిత గాని ఆమె ప్రతినిధి గాని రావాలని నిన్న నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమా భరత్ ఈడీ ఆఫీస్ లోనే దాదాపు 6 గంటలు ఉన్నారు. అయితే ఇవాళ మరోసారి ఆయన ఈడీ ఆఫీస్ కు వెళ్లడంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. సోమా భరత్ బయటకు వస్తే గాని దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితుల నుంచి చాలా సమాచారాన్ని అటు ఈడీ, ఇటు సీబీఐ సేకరించింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి నిధుల గురించి..అలాగే ఎవరి పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసులో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు సహా హైదరాబాద్ కు చెందిన పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే ఎమ్మెల్సీ కవిత 4 ఫోన్లు మార్చారని..మరిన్ని ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. అంతేకాదు మొత్తం 36 మంది 70 ఫోన్లు మార్చారని ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఫోన్ లో డేటా రికవరీ ద్వారా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. ఆ సమయంలో కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే 11న కవితను విచారించిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్న కారణంగా ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు రాలేనని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. ఆరోజు నెలకొన్న హైడ్రామాతో విచారణ జరగలేదు.
అయితే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీనితో ఆమె విచారణకు హాజరు కాక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పగా..21న కూడా కవిత విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీకి స్టీల్ కవర్ లో అప్పగించారు. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 3 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది.
అయితే ఫోన్లు ఓపెన్ చేసి డేటా రికవరీ చేసిన ఈడీ అధికారులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఫోన్లో ఉన్న డేటా ఆధారంగా రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు ఉండే అవకాశం లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana