గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు టైరు రన్నింగ్ లోనే ఊడిపోయింది. ఆ సమయంలో కారు తక్కువ స్పీడ్ తో వెళ్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. అసెంబ్లీ సమావేశాల నుంచి రాజాసింగ్ (MLA Rajasingh) తిరిగి ఇంటికి వెళ్తుండగా..ధూల్ పేట వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదం నుండి రాజాసింగ్ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా కొన్నిరోజులుగా తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ సరిగా లేదని ఆరోపణలు చేస్తుండగా ఈ ప్రమాదంతో అది మరింత బలపడినట్లైంది.
కాగా గతంలో కూడా రాజాసింగ్ (MLA Rajasingh) తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచూ మొరాయిస్తుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉన్నా పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలో రాజాసింగ్ ఇంటిలిజెన్సు ఐజీకి లేఖ రాశారు. తన భద్రతకు ముప్పు ఉందని, తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మార్చాలని రిక్వెస్ట్ చేస్తూనే ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచు బ్రేక్ డౌన్ అవుతుందని, దానిని మార్చాలని కోరారు. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. కొత్త వాహనాలు కొనడానికి డబ్బులు లేవా లేక కేసీఆర్ అనుమతి లేదా అని సెటైర్లు వేశారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా లేక అధికారులే సైలెంట్ గా ఉన్నారా అని రాజాసింగ్ (MLA Rajasingh) ప్రశ్నించారు.
కాగా పీడీ యాక్ట్(PD Act)కేసులో జైలు నుంచి రీసెంట్గా రిలీజైన రాజాసింగ్కు ఎక్కువ భద్రత ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కేటాయించారు. కానీ అది తరచు మొరాయిస్తుందని, ఒకసారి నడిరోడ్డు మీదే వాహనం ఆగిపోవడంతో ఆటోలో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇక ఇటీవల అఫ్జల్ గంజ్ లో కూడా రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ నడిరోడ్డుపై ఆగిపోయింది. దీనితో కారును మధ్యలోనే వదిలి నడుచుకుంటూ కొంతదూరం వెళ్లారు. అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు రాజాసింగ్. అయితే తనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పదే పదే మొరాయించడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. కండీషన్లోని వాహనంలో తనకు ఏమాత్రం భద్రత ఉంటుందనే విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి గతంలో తీసుకెళ్లినప్పటికి పోలీసులు స్పందించలేదని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే వాహనం మొరాయించడంతో కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాను. వారు రిపేర్ చేసి మళ్లీ పంపించారు. కానీ మళ్లీ పదే పదే వెహికల్ మొరాయిస్తుందని అన్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని అన్నారు. అందుకె ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాసినట్లు గతంలో రాజాసింగ్ పేర్కొన్నారు. కాగా గతంలో పలుమార్లు వెహికల్ మొరాయించగా..తాజాగా వెహికల్ టైర్ ఊడిపోవడంతో రాజాసింగ్ ప్రభుత్వంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Raja Singh, Telangana