హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తారని కొద్దిరోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే తెలంగాణ కేబినెట్ మీటింగ్ వాయిదా పడటంతో... లాక్డౌన్ ఉండదనే అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు. తాజాగా ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. హైదరాబాద్లో లాక్డౌన్తో ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కరోనా వస్తుంటుంది పోతుంటుందన్న తలసాని... ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా కట్టడి సాధ్యమని వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతురావే ఉదాహరణ అని అన్నారు. వీరంతా కరోనా నుంచి కోలుకున్నారని అన్నారు. ఆరోగ్యం బాగోలేని కొందరు మాత్రమే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని తలసాని అన్నారు.
ఇక కేసీఆర్ కనిపించడం లేదని వస్తున్న ఆరోపణలను మంత్రి తలసాని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా ? అని వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయం కడితే తప్పేంటని తలసాని అన్నారు. బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని సూచించారు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Coronavirus, Talasani Srinivas Yadav, Telangana, Telangana new secretariat