వరదల్లో 70 మంది మృతి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు లైఫ్ రిస్క్లో పెట్టుకోవద్దన్న మంత్రి కేటీఆర్
మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్
రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వరదల మృతిచెందినవారి సంఖ్య 70కి పెరిగిందని మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది మృతిచెందగా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 37 మంది చనిపోయారని తెలిపారు. ముగ్గురు గల్లంతయ్యారని చెప్పారు. మానవ తప్పిదాలు, ప్రభుత్వ తప్పిదాలు, ప్రకృతి ప్రకోపం ప్రస్తుత పరిస్థితులకు కారణమని కేటీఆర్ అన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. పై అంతస్తుల్లో ఉన్నవాళ్లు కూడా సహాయక కేంద్రాలకు వెళ్లాలని కోారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయంపై స్పందన రాలేదని.. వాళ్లు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. క్యూమెలో నింబస్ మేఘాలతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించిందని తెలిపారు. వర్షాలపై 80 మంది స్పెషల్ అధికారులను నియమించినట్టు చెప్పారు. మూడు చెరువులు తెగి భారీగా నష్టం జరిగిందన్నారు. ఏపీ, కర్ణాటకల నుంచి బోట్లు తీసుకొస్తున్నామని అన్నారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం హై అలర్ట్లో ఉందన్నారు. జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని ముంపు ప్రాంత ప్రజలను కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి.. జీహెచ్ఎంసీ
రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంతో.. నగరంలోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న అన్ని కాలనీలలో మైక్లో అనౌన్స్ చేస్తూ ఇళ్లలో ఉండవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కాలనీకి సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పునరావాస కేంద్రాలలో భోజన వసతి, దుప్పట్లతో పాటుగా.. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించినట్టు తెలిపింది. శిథిల, ప్రమాదకర, నీళ్లు నిలిచిన ఇళ్లను ఖాళీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నీరు చేరలేదని బిల్డింగ్ల అంతస్థుల్లో ఉండేవారు కూడా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని.. లేకుంటే ఇబ్బందులో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.