తండ్రిని మించిన దుర్మార్గుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించిందే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.వారు సృష్టించిన సమస్యకు పరిష్కారం కనుగొనాలి అంటూ ప్రధానికి లేఖ రాయడం ముమ్మాటికి అక్కడి ప్రజలను మోసం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. కృష్ణా జలాల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కృష్ణా నదిని దోచుకపోయే పద్ధతుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడ్డారని ఆయన విరుచుకుపడ్డారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడం,పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం వంటి చర్యలపై అహంకార పూరితంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తండ్రిని మించిపోయారన్నారు.అటువంటి నిర్ణయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తో పాటు నిరసన కూడా తెలిపామని ఆయన గుర్తుచేశారు. అంతే గాకుండా కేంద్రం దృష్టికి తీసుకపోవడం తో పాటు KRMBకి లేఖ రాశామన్నారు.చివరి ప్రయత్నంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు కూడా ఆక్షేపించందని,అయినా... ఖాతరు చెయ్యకుండా కోర్టు ధిక్కారణకు పాలడ్డారని ఆయన చెప్పారు. అయితే.. సర్వేల వరకు నిర్వహించుకుంటామని కోర్టుకు చెప్పిన ఆంధ్రా సర్కార్ పనులు కొనసాగించడం ఎంతవరకు సహేతుకమని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణా ప్రజలను మోసం చేసినట్లే కోర్టును కూడా మోసం చేసిన చరిత్ర ఉన్న వై యస్ జగన్ మోహన్ రెడ్డిదని దుయ్యబట్టారు..తాజాగా ప్రధానికి లేఖల పేరుతో అక్కడి ప్రజలను వంచనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.గతంలో మోసం చేసిన విధంగానేఇప్పుడు కూడా తెలంగాణా రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ఆంధ్రా సర్కార్ కుట్రలు పన్నుతోందన్నారు. ఇది తెలంగాణా రాష్ట్రమని ఇక్కడ ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్నారని ,కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కులను హరించే శక్తి ఏ ఒక్కరికి లేదని ఆయన తేల్చిచెప్పారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిందే.. జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని స్పష్టం చేశారు.. ఆ తరువాత మారిన పరిస్థితులకనుగుణంగా ఇతర అవసరాల కోసం జీ ఓ లు వచ్చాయంటూ చిలకపలుకులు పలుకుతున్న ఆంధ్రాసర్కార్ ఏనాడైనా తెలంగాణా అవసరాల కోసం ఒక్కటి అంటే ఒక్క జీ ఓ ఇచ్చారా అంటూ ఆయన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
మద్రాస్కు మంచినీళ్ళ పేరుతో దివంగత వై యస్ రాజశేఖర్ రెడ్డి నీళ్లను దోచుకపోయారన్నారు.ఆ తరువాత అదే కాలువలను వెడల్పు చేస్తూ పోయి 300 టి యం సి ల నీటిని రాయలసీమ కు తరలించుకు పోయేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. వై యస్ అధికారంలో ఉన్నన్నిరోజులు తెలంగాణ నాయకత్వం వారికి బానిసలుగా పని పనిచేశారని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఎడమకాలువ కింది ఆయకట్టు రైతాంగాన్ని 50 ఏండ్లుగా ద్రోహం చేసిన చరిత్ర ఆంధ్రా సర్కార్దేనని అన్నారు. ఎడమ కాలువ భూముల్ని ఎండపెట్టిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులదని అన్నారు.వరుసగా ఏడేండ్లు కరువు వచ్చినా నీళ్లు వదల కుండా కుడి కాలువకు నీళ్లు వదిలింది నిజం కాదా అని ఆయన నిలదీశారు.కృష్ణా డెల్టాకు అవసరమైన ప్రతి సందర్భంలో హుకుం లు జారీ చేయడం,దౌర్జన్యాలకు పాల్పడడం, అధికారులను బెదిరించడం వారికి పరిపాటుగా మారిందన్నారు.రైతులు ఎక్కడైనా రైతులేనని ఇరు ప్రాంతాల రైతులకు ప్రయోజనాకారిగా ఉండే ఫార్ములాను కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ని అభినందించి ముందట పెడితే స్పందించకుండా ఇప్పుడు మూర్ఖపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు కేంద్రంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంకోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరినా నాలుగు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గోదావరి జలాల వివాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సంవత్సరం కాలం లోనే పరిష్కరించబడిందన్నారు.అదే పద్దతిలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహ హస్తాన్ని అందించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కు భంగం వాటిల్లికుండా నీళ్లను ఎట్లా వాడుకోవలో వివరించారన్నారు. కృష్ణాలో నీళ్లు తక్కువగా ఉంటాయని గోదావరి జలాలు భవిష్యత్ అవసరాలకు అందుబాటులో ఉంటాయని ప్రతి సంవత్సరం సముద్రం పాలు అవుతున్న నీటిని ఎట్లా వాడుకోవలో అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి స్పష్టంగా వివరించారని ఆయన గుర్తుచేశారు.ఇప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ అదేమాట మీద ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ఇద్దరు ముఖ్యమంత్రిలు పరస్పరం నేరుగా చర్చలు జరుపుకున్నప్పటికి ఆయన తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ప్రధానికి లేఖ రాశారని ఆయన ఎద్దేవాచేశారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో దుర్భిక్షం, కరువు తాండవిస్తూ లక్షలాది మంది వలసలు పోయే జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్, నల్లగొండ,రంగారెడ్డి జిల్లాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి పనులకు స్వస్తి పలికి అక్రమ నిర్మాణాలకు పుల్ స్టాఫ్ పెట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Telangana, Water dispute