వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ మహానగరానికి వలసొచ్చారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధి పోయింది. మార్చి 22 నుంచి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వలస కూలీలు ఇక్కడే చిక్కుకుపోయారు. మరోసారి లాక్డౌన్ను పొడగించడంతో ఇక వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పిల్లలు, కుటుంబాలతో కలిసి రోడ్డు వెంట కాలినడక రాష్ట్రాలకు వెళ్లేందుకు బాటపట్టారు. మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో రోడ్డుపై పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న కూలీలను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చూసి కారు ఆపి దిగారు. వలస కూలీలను ఎక్కడికి వెళుతున్నారంటూ పరామర్శించారు. దీంతో వారు హైదరాబాద్ నగరం నుంచి ఐదారు రోజులుగా కాలినడకన నడుచుకుంటూ వస్తున్నామని బదులివ్వడంతో మంత్రి హరీశ్ రావు చలించిపోయారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లొద్దని.. మనోహరాబాద్లోనే ఆశ్రయం కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు కూలీలకు చెప్పారు. కానీ కూలీలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ సొంత ప్రాంతాలకు వెళతామని, ఇక్కడ ఉంటే పని లేకపోవడంతో పాటు ఆకలితో అలమటిస్తున్నామని చెప్పుకొచ్చారు. వేసవి కాలంలో పిల్లలతో కాలినడకన వెళ్లడం శ్రేయస్కరం కాదని, ఇక్కడే ఉండాలని నచ్చచెప్పడంతో చివరకు వలస కార్మికులు అంగీకరించారు. వారు స్థానికంగా ఉండేందుకు అన్ని రకాలుగా సాయం అందిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Hyderabad, Telangana