(G.Srinivasa Reddy, News 18, Khammam)
నిషేధిత మావోయిస్టు సైన్యానికి, భద్రతా బలగాలకు మధ్య యుద్ధ వాతావరణంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు సహా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులను ఆనుకుని ఉండే దండకారణ్యం, బస్తర్ ప్రాంతాల్లో నిత్యం అలజడుగులు రేగుతుండటం తెలిసిందే. కొంతకాలంగా మావోయిస్టు అగ్రనేతలు వరుసగా మరణిస్తున్న క్రమంలో బుధవారం చోటుచేసుకున్న పరిణామం సంచలనంగా మారింది. మావోయిస్టు దళ సభ్యుడు మాడవి హిడ్మా తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడు. ములుగు జిల్లా పోలీసులు ఆయన వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్ గఢ్ లోని కిష్టారం మండలం తొండమర్క గ్రామానికి చెందిన మాడావి హిడ్మా(25) ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఎదుట లొంగిపోయారు. 16 ఏళ్ల వయసులోనే ఉద్యమంలోకి వెళ్లిన హిడ్మా 2018 నుంచి రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ(ఆర్పీసీ)లో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలి కాలంలో కింది స్థాయి సభ్యులపై వేధింపులు పెరగడం వల్లే పార్టీ నుంచి వైదొలగాలని హిడ్మా నిర్ణయించుకున్నట్లు సమాచారం. హిడ్మా లొంగుబాటుపై పోలీసుల ప్రకటన తర్వాత ఒకింత కన్ఫ్యూజన్ ఏర్పడింది. పేర్లు ఒకటే కావడంతో లొంగిపోయింది మావోయిస్టు అగ్రనేత హిడ్మా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
దళ సభ్యుడు హిడ్మా లొంగుబాటు క్రమంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్స్ సైతం చర్చలోకి వచ్చాయి. గడిచిన నాలుగేళ్లలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన అతి భారీ, కిరాతక దాడులకు సూత్రధారి, పాత్రధారి కూడా అయిన హిడ్మా.. మోస్ట్ వాంటెడ్ జాబితాలో అగ్రభాగాన ఉన్నాడు. ఆ పార్టీ ముఖ్యనేతలు ఆర్కే, హరిభూషణ్ మరణాల తర్వాత అన్ని వ్యవహారాలను హిడ్మానే లీడ్ చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే..
మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా గతంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి ప్రవేశించినట్టు వార్తలొచ్చాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన హిడ్మా చికిత్స కోసం తెలంగాణలోకి వచ్చినట్టు అనుమానించారు. ఆర్కే మృతిచెందిన సమయంలో హిడ్మాతో పాటు మరికొందరు మావోయిస్ట్ నేతలపై విష ప్రయోగం జరిగిందని ఆ పార్టీ సానుభూతిపరులు ఆరోపించారు.
తనపై విష ప్రయోగం జరిగిందనే అనుమానంతోనే హిడ్మా కూడా ఛత్తీస్గఢ్ను వీడినట్లు ప్రచారం జరిగింది. చిన్న వయసులోనే మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నారు. పీఎల్జీఏ-1 బెటాలియన్ కమాండర్గా, ఛత్తీస్గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కూంబింగ్ సమయంలో భద్రతా బలగాలపై మెరుపు దాడుల్లో హిడ్మా సిద్ధహస్తుడు.
ఈ ఏడాది ఏప్రిల్లో బీజాపూర్ తరెంలో సీఆర్పీఎఫ్ బలగాలు అతడు పన్నిన వ్యూహంలో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 76మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న 2010 నాటి తడ్మెట్ల దాడి, 2013లో జిరామ్ఘాట్ దాడి, 2017లో 27 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హతమార్చిన ఘటనలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Maoist, Maoists, Mulugu, Telangana